కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు | Jagtial Software Prasanna Lakshmi Incident | Sakshi
Sakshi News home page

కొడుకు అందంగా పుట్టాడని వేధింపులు

Apr 25 2025 11:16 AM | Updated on Apr 26 2025 7:33 AM

Jagtial Software Prasanna Lakshmi Incident

జగిత్యాల క్రైం: ‘అమ్మా, నాన్నా.. నా కొడుకును మీరే పెంచండి. భర్త, అత్తమామల వేధింపులు భరించలేకపోతున్నా. నా భర్త మారతాడని అనుకున్న. నా ఆశ నిరాశే అయ్యింది. కొడుకు అందంగా పుట్టాడన్న అనుమానంతో నిత్యం వేధిస్తున్నాడు. కట్నం వేధింపులు కూడా ఎక్కువయ్యా యి’.. అని సూసైడ్‌ నోట్‌ రాసి వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన ప్రసన్నలక్ష్మి (26)ని రెండేళ్ల క్రితం వెల్గటూర్‌ మండలం రాంనూర్‌ గ్రామానికి చెందిన తిరుపతికి ఇచ్చి వివాహం చేశారు. 

పెళ్లి సమయంలో రూ.55 లక్షల కట్నం ఇస్తామని ఒప్పుకుని.. రూ.10 లక్షలు ముట్టజెప్పారు. దంపతులిద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో ప్రసన్నలక్ష్మికి బాబు జన్మించాడు. అప్పటి నుంచి ఆమె ఇంటివద్దే ఉంటోంది. ప్రసన్నలక్ష్మి, తిరుపతి ఇద్దరూ చామన ఛాయలో ఉండగా.. బాబు తెల్లగా, అందంగా పుట్టాడన్న అనుమానం తిరుపతి మనసులో మొలకెత్తింది. అప్పటి నుంచి తరచూ ప్రసన్నలక్ష్మిని వేధిస్తున్నాడు. మిగతా కట్నం డబ్బు కావాలని ఒత్తిడి పెంచాడు. భర్త తిరుపతి, అత్త, మామ, ఆడబిడ్డలు వేధిస్తుండటంతో ఐదురోజుల క్రితం ప్రసన్నలక్ష్మి బెంగళూరు నుంచి జగిత్యాలలోని తల్లిదండ్రుల ఇంటికి వచ్చింది. 

ఇంట్లో ఉన్న అద్దంపై ‘అమ్మా నాన్న నాకు బతకాలని లేదు. నా కొడుకు జాగ్రత్త. ప్లీజ్‌ వాళ్లకు మాత్రం నా బాబును ఇవ్వకండి’అని రాసి ఫ్యాన్‌కు ఉరేసుకుని బుధవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ప్రసన్నలక్ష్మి భర్త, అత్త మామలపై చర్యలు తీసుకోవాలని గురువారం ఉదయం ఆమె బంధువులు ఆందోళనకు దిగారు. డీఎస్పీ రఘుచందర్, పట్టణ సీఐ వేణుగోపాల్‌ మృతురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మృతురాలి తండ్రి ఉప్పునీటి గంగాధర్‌ ఫిర్యాదు మేరకు ఆమె భర్త, అత్తమామలు, ఆడబిడ్డలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement