మల్యాల:ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ సంతోష్కుమార్ స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు తీర్థ, ప్రసాదాలు అందించి ఆశీర్వదించారు.
గోడలు పాఠాలు బోధిస్తాయి
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులే కాకుండా గోడలు కూడా పాఠాలు బోధిస్తున్నాయి. విద్యార్ధులకు బోధించడంతోపాటు కళ్లకట్టినట్లు చిత్రాలు చూపిస్తే సులువుగా అర్థమవుతుందన్న ఆలోచనతో జిల్లా విద్యాశాఖ ఈప్రక్రియ చేపట్టింది. పెద్దపల్లి జిల్లా మంథని మండలం మల్లారం మండల ప్రాథమిక పాఠశాల గోడలపై ఇందుకోసం ప్రత్యేకంగా చిత్రాలు రూపొందించారు. వివిధ పాఠ్యాంశాల ఆధారంగా చిత్రకారులతో బొమ్మలు గీయించారు. తెలుగు గణాంకాలు, ఆంగ్ల పదాలు, పండ్లు, వాటి పేర్లలాంటి చిత్రాలతో పాఠశాల ఆకట్టుకుంటోంది. హెచ్ఎం కోండ్ర శ్రీనివాస్ ఆధ్వర్యంలో గత విద్యాసంవత్సరం చిత్రాలు వేయించారు. ఆకట్టుకునే చిత్రాలతో పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతున్నాయని హెచ్ఎం తెలిపారు. – మంథనిరూరల్


