ఐటీఐఆర్‌ ఇచ్చే వరకుమాట్లాడుతూనే ఉంటా | Jaggareddy comments over modi | Sakshi
Sakshi News home page

ఐటీఐఆర్‌ ఇచ్చే వరకుమాట్లాడుతూనే ఉంటా

Jun 27 2024 3:42 AM | Updated on Jun 27 2024 3:42 AM

Jaggareddy comments over modi

మోదీ రద్దు చేయకపోయి ఉంటే పదేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవి

టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.జగ్గారెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాతే రాష్ట్రానికి రావలసిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టు ఆగిపోయిందని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి. జగ్గారెడ్డి విమర్శించారు. గత కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సోనియా గాంధీ, మన్మోహన్‌ సింగ్‌ ఇచ్చిన ఐటీఐఆర్‌ ప్రాజెక్టు గురించి ఐదు రోజుల క్రితం మాట్లాడానని అన్నారు. యువతకు ఉద్యోగాలు దొరికే అంశం కాబట్టి ఐటీఐఆర్‌ ప్రాజె క్టును మంజూరు చేసేంత వరకు తాను కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతూనే ఉంటానని, ఇలా ఐదు రోజులకు ఒకసారి దీనిమీద మాట్లాడతానని తేల్చిచెప్పారు. 

బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో కేంద్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌ ఐటీఐఆర్‌కు అనుమతి ఇవ్వడమే కాక, 50 వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్టును పెట్టాల ని నిర్ణయించిందని, తద్వారా 60 లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా వేసిందని వివరించారు. మోదీ ప్రధాని అయ్యాక దానిని రద్దు చేశారని అన్నారు. మోదీ ఆ ప్రాజెక్టును రద్దు చేయకపోయి ఉంటే పదేళ్లలో 15 లక్షల ఉద్యోగాలు వచ్చేవన్నారు. 

రాహుల్‌ గాంధీ ప్రధాని అయి ఉంటే.. తామే ఐటీఐఆర్‌ తెచ్చే వాళ్ళమని పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సంజయ్‌లను కలిసి వినతిపత్రం సమర్పిస్తానని, రద్దు చేసిన ఐటీఐఆర్‌ మళ్లీ తెమ్మని అడుగుతానని అన్నారు. ఎంపీ రఘునందన్‌రావు తనకు ఐటీఐఆర్‌ గురించి అ ఆ లు కూడా తెలియవని అన్నారని, విద్యాపరంగా తాను వీక్‌ అని ఒప్పుకుంటున్నట్లు చెప్పారు. అయితే, రఘునందన్‌కు ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖల గురించి, జగ్గారెడ్డి గురించి తెలియదని, కిషన్‌రెడ్డి, దత్తా త్రేయలను అడిగితే చెపుతారని పేర్కొన్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement