రైల్వే టికెట్ల బుకింగ్‌.. కీలక విషయాలు | IRCTC Railway: 89 Percent Reserved Tickets booking through online | Sakshi
Sakshi News home page

కౌంటర్‌ కంటే క్లిక్‌ మేలు.. 90 శాతం టికెట్లు ఆన్‌లైన్‌లోనే!

Sep 18 2026 6:56 PM | Updated on Sep 18 2026 7:15 PM

IRCTC Railway: 89 Percent Reserved Tickets booking through online

రైల్వే రిజర్వేషన్‌లో నామమాత్రమవుతున్న స్టేషన్‌ కౌంటర్లు

వచ్చే నాలుగైదేళ్లలో మరింతగా మారనున్న పరిస్థితి

సాక్షి, హైదరాబాద్‌: రైల్వే టికెట్‌ కావాలంటే ఒకప్పుడు స్టేషన్‌కు పరుగుపెట్టేవారు... అక్కడ రిజర్వేషన్‌ కౌంటర్‌.. చాంతాడంత క్యూ.. గంటల తరబడి నిరీక్షణ. ఇప్పుడు పరిస్థితి మారింది. చేతిలో స్మార్ట్‌ఫోన్‌ ఉంటే చాలు.. కోరుకున్న రైలుకు, కోరుకున్న రోజుకు టికెట్‌ రిజర్వ్‌ అవుతుంది. ఇలా ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ కొత్తేమీ కానప్పటికీ, ఇప్పుడు దేశవ్యాప్తంగా దగ్గరదగ్గరగా 90 (జూన్‌ వరకు గణాంకాల ప్రకారం 89 శాతంగా ఉంది) శాతం టికెట్లు ఆన్‌లైన్‌లోనే బుక్‌ అవుతున్నాయి. అంటే, రైల్వే శాఖ ప్రత్యేకంగా నిర్వహించే కౌంటర్లలో కేవలం 10 శాతం టికెట్లే అమ్ముడవుతున్నాయి.

మరో మూడునాలుగేళ్లలో ఇక ప్రత్యేకంగా స్టేషన్‌లలో రిజర్వేషన్‌ కౌంటర్లే అవసరం లేదన్న పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. కరెంట్‌ బుకింగ్‌ టికెట్లు తప్ప రిజర్వ్‌డ్‌ టికెట్లకు ప్రత్యేకంగా స్టేషన్‌కు జనం రారని ఐఆర్‌సీటీసీ అంచనా వేస్తోంది. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించలేని వారు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ వ్యవస్థ కొనసాగుతుంది. గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా మొత్తం 65.08 కోట్ల రిజర్వుడ్‌ టికెట్లు బుక్‌ కాగా... ఇందులో 57.90 కోట్లు ఆన్‌లైన్‌ ద్వారా, 7.18 కోట్లు కౌంటర్ల ద్వారా బుక్‌ అయ్యాయని తెలుస్తోంది.

కౌంటర్‌ కంటే క్లిక్‌ మేలు! 
రైల్వే రిజర్వేషన్‌ వ్యవస్థలో డిజిటల్‌ మార్పు ఒక్కసారిగా వచ్చింది కానప్పటికీ, ఇప్పుడది మరింత వేగాన్ని పట్టుకుంది. 2013–14లో రిజర్వ్‌డ్‌ టికెట్లలో ఆన్‌లైన్‌ వాటా సుమారు 49 శాతం మాత్రమే. ఇప్పుడు అది 90 శాతానికి చేరువైంది. రైల్వే కూడా ప్రయాణికులను డిజిటల్‌ వైపు తీసుకెళ్లేలా ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్, మొబైల్‌ యాప్, కొత్తగా రైల్‌ వన్‌ వంటి సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. 2026 మార్చి నాటికే రిజర్వుడ్‌ టికెట్లలో ఆన్‌లైన్‌ వాటా సుమారు 88 శాతానికి చేరినట్లు కేంద్రం వెల్లడించింది.  

ఎందుకింతగా ఆన్‌లైన్‌ వైపు? 
టికెట్‌ కోసం రైల్వే స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకపోవడం ప్రధాన కారణం. ఇంట్లో నుంచే సీట్ల లభ్యత చూడటం, రైలు ఎంపిక చేసుకోవడం, చెల్లింపు చేయడం, టికెట్‌ను మొబైల్‌లోనే పొందడం వంటి సదుపాయాలు ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేస్తున్నాయి.

ఇదీ చదవండి: నాజూకు ఫోన్లతో పెరుగుతున్న రోగాలు!

మరోవైపు కౌంటర్ల వద్ద క్యూలు, ప్రయాణ సమయం, నగదు చెల్లింపుల అవసరం వంటి అంశాలు డిజిటల్‌ బుకింగ్‌తో దాదాపు తప్పిపోయాయి. రద్దీ సమయాల్లో, ముఖ్యంగా పండుగల సమయంలో ఈ సౌకర్యం మరింత కీలకంగా మారింది.

డబుల్‌ సామర్థ్యంతో రైల్వే సర్వర్లు... 
గతంలో ఒకేరోజు ఎక్కువ సంఖ్యలో టికెట్లు బుకింగ్‌ జరిగితే సర్వర్‌ క్రాష్‌ అయ్యేది. ఇప్పుడు ఆ సమస్యను అధిగమించి రికార్డు స్థాయిలో టికెట్లు బుక్‌ అయ్యాయి. భారీ ట్రాఫిక్‌ను తట్టుకునేందుకు ఐఆర్‌సీటీసీ తన నెక్ట్స్‌ జనరేషన్‌ ఈ–టికెటింగ్‌ వ్యవస్థను అప్‌గ్రేడ్‌ చేసింది. కొత్త సర్వర్లు, సాఫ్ట్‌వేర్‌ ఆర్కిటెక్చర్‌లో మార్పులతో వ్యవస్థ సామర్థ్యాన్ని దాదాపు రెట్టింపు చేసినట్లు ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. 2026 జూలై 15న కొత్త యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ బీటా వెర్షన్‌ను కూడా అందుబాటులోకి తెచ్చింది. ఒకే స్క్రీన్‌పై వివిధ తరగతుల సీట్ల లభ్యతను చూసుకునే సదుపాయం కల్పించింది. 

ఇదీ చదవండి: యాపిల్‌ మడతపెట్టే ఫోన్‌పై మీమ్స్‌!

దళారులకు చెక్‌.. 
డిజిటల్‌ బుకింగ్‌ పెరిగిన కొద్దీ నకిలీ ట్రాఫిక్, బాట్ల సమస్య కూడా పెరిగింది. 2026లోని ఆరు నెలల గణాంకాల ప్రకారం .. ఐఆర్‌సీటీసీ వ్యవస్థకు వచ్చిన భారీ సంఖ్యలో యాక్సెస్‌ రిక్వెస్టుల్లో సగానికి పైగా బాట్ల(సాఫ్ట్‌వేర్‌ ఆధారిత) నుంచే వచ్చిన సందర్భాలు నమోదయ్యాయి. ఆరు నెలల సగటులో 57.74 శాతం రిక్వెస్టులను బాట్‌ ట్రాఫిక్‌గా గుర్తించి నిరోధించినట్లు రైల్వే గణాంకాలు చెబుతున్నాయి. ఇక అక్రమ బుకింగ్స్‌ను అడ్డుకునేందుకు అనుమానాస్పద యూజర్‌ ఐడీల డీయాక్టివేషన్, నకిలీ వెబ్‌సైట్లు–యాప్‌లపై చర్యలు, ఏజెంట్లపై నియంత్రణ వంటి చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement