ఫార్ములా-ఈ రేసు కేసు..హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట దక్కేనా? | High Court To Deliver Verdict On KTR Quash Petition Today In Formula E Car Race Case, More Details Inside | Sakshi
Sakshi News home page

ఫార్ములా-ఈ రేసు కేసు..హైకోర్టులో కేటీఆర్‌కు ఊరట దక్కేనా?

Jan 7 2025 8:17 AM | Updated on Jan 7 2025 10:49 AM

High Court to Deliver Verdict on KTR Quash Petition Today

సాక్షి,హైదరాబాద్‌ :  ఫార్ములా ఈ-కార్‌ రేసు (formula e car race case) నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ తనపై ఏసీబీ (acb) నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కేటీఆర్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పును వెలువరించనుంది. ఉదయం 10.30 గంటలకు తీర్పు వెల్లడించనుంది. ఈ తరుణంలో ఫార్ములా ఈ-రేస్‌ కేసులో కేటీఆర్‌ (ktr)కు ఊరట లభిస్తుందా అనే అంశంపై బీఆర్‌ఎస్‌ (brs) శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కోర్టులో కేసు విచారణ నేపథ్యంలో నల్గొండలో బీఆర్‌ఎస్‌ చేపట్టిన రైతు మహాధర్నాను సైతం వాయిదా వేసింది. 

కేటీఆర్‌ క్వాష్‌  పిటిషన్‌ .. 
డిసెంబర్‌ 20న ఫార్ములా–ఈ వ్యవహారంలో కేటీఆర్, ఇద్దరు అధికారులను నిందితులుగా చేరుస్తూ.. ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసు ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణ చేపట్టిన కోర్టు కేటీఆర్‌కు ఊరట కల్పించింది. డిసెంబర్‌ 30వ తేదీ వరకు అరెస్ట్‌ చేయొద్దని ఆదేశించించింది. అయితే కేసు దర్యాప్తును కొనసాగించవచ్చని పేర్కొంది. అధికారులు అడిగిన డాక్యుమెంట్లు, వివరాలు అందజేసి దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్‌ (కేటీఆర్‌)కు సూచించింది. ఈ పిటిషన్‌పై పది రోజుల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ఏసీబీకి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్‌కు నోటీసులు జారీ చేసింది. ఇక కేటీఆర్‌ క్వాష్‌ పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు తీర్పు వెలువరించనుంది. 

ఫార్ములా ఈ- కార్‌ రేసులో కేసులు నమోదు
‘ఫార్ములా–ఈ’కార్ల రేసు వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) రంగంలోకి దిగింది. ఏసీబీ పెట్టిన కేసు ఆధారంగా ‘ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కేసు ఇన్ఫర్మేషన్‌ రిపోర్ట్‌ (ఈసీఐఆర్‌)’ను నమోదు చేసింది. హైదరాబాద్‌ మహా నగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నుంచి విదేశీ కంపెనీకి నిధుల చెల్లింపు అంశంలో రాష్ట్ర అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) కేసులు నమోదు చేశాయి. ‘ఫార్ములా–ఈ’కారు రేస్‌ నిర్వహణకు సంబంధించి హెచ్‌ఎండీఏ నుంచి పలు దఫాల్లో రూ.45,71,60,625 సొమ్మును యూకేకు చెందిన ‘ఫార్ములా–ఈ ఆపరేషన్స్‌ (ఎఫ్‌ఈఓ)’కు బదిలీ చేశారని పేర్కొంటూ.. మాజీ మంత్రి కేటీఆర్, మరో ఇద్దరు అధికారులను అందులో నిందితులుగా చేర్చారు.

ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా.. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్‌ కోణంలో విచారణ కోసం ఈడీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఈడీ హైదరాబాద్‌ జోనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఏసీబీ డీజీ విజయ్‌కుమార్‌కు లేఖ రాశారు. విదేశీ కంపెనీతో జరిగిన నగదు లావాదేవీలు, ఇతర వివరాలన్నీ తమకు ఇవ్వాలని కోరారు. ఏసీబీ నుంచి అందిన వివరాల ఆధారంగా.. మాజీ మంత్రి కేటీఆర్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, మాజీ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్‌ఎన్‌ రెడ్డిలపై మనీలాండరింగ్‌ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈసీఐఆర్‌ నమోదు చేశారు. 

కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement