రాగానే దంచికొట్టింది | heavy rains in telangana | Sakshi
Sakshi News home page

రాగానే దంచికొట్టింది

Jun 10 2026 5:44 AM | Updated on Jun 10 2026 5:45 AM

heavy rains in telangana

సచివాలయం సమీపంలో ముంచెత్తిన వర్షం

హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షం 

గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌..నగరవాసి నరకయాతన 

బండ్లగూడలో విద్యుత్‌ తీగ తగిలి ఇద్దరు మృతి 

నిర్మల్, సిద్దిపేట జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన జొన్న, ధాన్యం 

సాక్షి, హైదరాబాద్‌: రాజధాని హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం‘నైరుతి’ వాన దంచికొట్టింది. మధ్యాహ్నం వరకు సాధారణంగా ఉన్న వాతావరణం సాయంత్రానికి ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో భారీ వర్షం బీభత్సం సృష్టించింది. అడిక్‌మెట్, విద్యానగర్, అంబర్‌పేట్, ఖైరతాబాద్, పంజగుట్ట, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల్లో మోకాలి లోతు నీరు నిలిచింది. పలు జంక్షన్లు చెరువులను తలపించాయి. సాయంత్రం 5 గంటల సమయంలో ఉద్యోగులు ఇళ్లకు బయలుదేరే వేళ వర్షం పడటంతో ఐటీ కారిడార్‌ సహా పలు మార్గాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

దీంతో గంటల తరబడి వాహనదారులు నరకయాతన అనుభవించారు. మల్కాజ్‌గిరిలో 12.9 సెం.మీ. భారీ వర్షపాతం నమోదైంది. బన్సీలాల్‌పేటలో 8.7 సెం.మీ., విఠల్‌వాడీలో 7.8 సెం.మీ. వాన పడింది. మొత్తం 14 ప్రాంతాల్లో 5 సెం.మీ.కుపైగా వర్షం నమోదైంది. పలుచోట్ల చెట్లు, కొమ్మలు విరిగి రోడ్లపై పడ్డాయి. భారీ సైన్‌బోర్డులు, ఫ్లెక్సీలు ఊడి పడటంతో కార్లు, బైక్‌లు దెబ్బతిన్నాయి. భద్రతా కారణాలతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడంతో వందల కాలనీలు గంటల తరబడి చీకట్లో మగ్గాయి. 

టీ తాగుదామని వచ్చి.. 
బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో తెగిపడిన విద్యుత్‌ తీగ తగిలి ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. జహంగీరాబాద్‌కు చెందిన అఫ్రోజ్‌(30), జాఫర్‌(15) పరిచయస్థులు. వీరు మంగళవారం సాయంత్రం టీ తాగేందుకు బండ్లగూడ చౌరస్తా సమీపంలోని రాయల్‌ సి హోటల్‌కు ఆటోలో వచ్చారు. అప్పటికే అక్కడ ఓ స్ట్రీట్‌లైట్‌కు సంబంధించిన విద్యుత్‌ వైరు తెగిపడి ఉంది. నీరు నిలిచి ఉండటంతో గమనించలేకపోయారు. ఈ క్రమంలో మొదట ఆటో దిగిన జాఫర్‌.. షాక్‌ తగిలి కింద పడిపోయాడు. అతన్ని కాపాడే క్రమంలో అఫ్రోజ్‌ నేరుగా వైర్‌కు తగలడంతో విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోయాడు. అపస్మారక స్థితిలో ఉన్న జాఫర్‌ను స్థానికులు చికిత్స నిమిత్తం ఒవైసీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

జిల్లాల్లో తడిసిన ధాన్యం 
నిర్మల్‌ జిల్లాలో సోమవారం రాత్రి, మంగళవారం వేకువజామున మోస్తరు వర్షం కురిసింది. కుంటాల మండలంలోని జామున ఓల, లింబా(కె), కల్లూరు, కుంటాల, పెంచికల్‌పాడ్‌లో 6.6 సెం.మీ. వర్షపాతం నమోదైంది. దీంతో కొనుగోలు కేంద్రాల్లో జొన్న, వరి ధాన్యం తడిసింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోనూ మార్కెట్‌ యార్డు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్, సొనాల మండలాల్లో భారీ వర్షం ప్రభావం చూపింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. సొనాల మండలం పెద్దగూడ సరిహద్దులో వాగు ఉధృతికి వంతెన సమీపంలోని రోడ్డు కొట్టుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement