కేసీఆర్‌ను నైతికంగా దెబ్బతీసే కుట్ర | Harish Rao condemns illegal arrest of Kavitha | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ను నైతికంగా దెబ్బతీసే కుట్ర

Mar 16 2024 4:58 AM | Updated on Mar 16 2024 4:44 PM

Harish Rao condemns illegal arrest of Kavitha - Sakshi

మాట్లాడుతున్న హరీశ్‌రావు.చిత్రంలో జగదీశ్‌రెడ్డి, వేముల

రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు: హరీశ్‌రావు 

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టును ఖండిస్తున్నాం 

ఇది రాజకీయ ప్రేరేపితం.. అప్రజాస్వామిక చర్య 

కోర్టుకు సెలవులు ఉండేలా చూసి మరీ అరెస్ట్‌ చేశారు 

దీనిని రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం 

బీజేపీ దురుద్దేశపూరిత చర్యను ప్రజాక్షేత్రంలో నిలదీస్తామని వెల్లడి 

నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు బీఆర్‌ఎస్‌ పిలుపు 

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయడం అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మండిపడ్డారు. కవిత అరెస్టును బీఆర్‌ఎస్‌ తీవ్రంగా ఖండిస్తోందని.. ఇది బీఆర్‌ఎస్‌ పారీ్టని, పార్టీ అధినేత కేసీఆర్‌ను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నంలో భాగమేనని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధిపొందడానికే బీజేపీ, కాంగ్రెస్‌ కుమ్మక్కై కుట్ర పన్నాయని ఆరోపించారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో శుక్రవారం రాత్రి తెలంగాణభవ న్‌లో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులతో కలసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘మాది ఉద్యమ పార్టీ, వేధింపులు, అరెస్టులు, కుట్రలు మాకు కొత్త కాదు. ఇలాంటి ఎన్నో కుట్రలు, అక్రమ కేసులు, అరెస్టులను ఛేదించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాం. కవిత అరెస్టును రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కొంటాం. బీజేపీ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన తెలపాల్సిందిగా బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం. ఎన్నికల ముందు కుట్ర: సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతుండగా శుక్ర, శనివారాల్లో సెలవు ఉంటుందని తెలిసి మరీ కవితను అరెస్టు చేశారు. రాజకీయంగా బీఆర్‌ఎస్‌ను దెబ్బతీయాలనే దురుద్దేశంతో, కుట్రతో ఈ అరెస్టు జరిగింది. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ ఎంపీలు, ఇతర నేతలు అనేకమార్లు కవితను అరెస్టు చేస్తామంటూ ఈడీ అధికారుల తరహాలో మాట్లాడారు. శనివారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడుతున్న నేపథ్యంలో కవితను అరెస్టు చేసి రాజకీయంగా లబ్ధి పొందేందుకు బీజేపీ కుట్ర పన్నింది. 

బీఆర్‌ఎస్‌పై రాజకీయ కక్ష సాధింపు 
ఈడీ కేసు అంశం శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకురాగా.. 19వ తేదీకి వాయిదా వేసింది. ఎలాంటి అక్రమ చర్యలకు పాల్పడబోమని సుప్రీంకోర్టుకు ఈడీ హామీ ఇచి్చంది. ఆ హామీని పక్కనపెట్టి శుక్రవారం సాయంత్రం కవితను అరెస్టు చేయడం అక్రమం. రాజకీయ ప్రేరేపితం. కవిత కోర్టుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తనిఖీలంటూ ఈడీ అధికారులు వచ్చారు.

ప్రణాళిక ప్రకారం ముందే విమానం టికెట్లు కూడా బుక్‌ చేశారు. శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవులు కాబట్టి అక్రమ అరెస్టుకు ప్లాన్‌ చేశారు. ఇది ఎమర్జెన్సీని మించిన పరిస్థితి. గతంలో మా పార్టీకి చెందిన మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ సహా అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మీద ఈ తరహా ప్రయత్నాలు జరిగాయి. గతంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ ప్రయత్నాలు చేసింది. ఏడాదిన్నర క్రితం కవితను సాక్షిగా పేర్కొంటూ నోటీసులిచి్చ, ప్రస్తుతం నిందితురాలిగా చేర్చడం వెనుక రాజకీయ దురుద్దేశం దాగి ఉంది. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు, కుట్రలను బీఆర్‌ఎస్‌ ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటుంది..’’అని హరీశ్‌రావు పేర్కొన్నారు.

కేసీఆర్‌ను లొంగదీసుకునే ప్రయత్నం: జగదీశ్‌రెడ్డి 
బీజేపీ ప్రభుత్వానికి ఎదురొడ్డి నిలిచిన కేసీఆర్‌ను బెదిరించి, లొంగదీసుకుని రాజకీ య లబ్ధి పొందే ఉద్దేశంలో భాగంగానే ఎమ్మెల్సీ కవిత అరెస్టు జరిగిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. వివిధ రాష్ట్రాల్లో తమకు అడ్డుగా ఉన్న ప్రతిపక్ష పారీ్టల నేతలకు నోటీసులిచ్చి, బీజేపీలో చేరిన వెంటనే వెనక్కి తీసుకున్న ఘటనలు అనేకం ఉన్నాయన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement