
పంజగుట్ట(హైదరాబాద్): భర్త పెట్టే చిత్రహింసలు భరించలేక, అమెరికాలో చిక్కుకున్న తన కుమార్తెను కాపాడాలని ఓ తండ్రి వేడుకుంటున్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధితుడు గులాం అఫ్జల్, న్యాయవాది విజయ్కుమార్ మాట్లాడుతూ... తన కూతురు ఫాతిమా హస్నాకు 2007లో గుల్బర్గాకు చెందిన డబీరుద్దీన్ అనే డాక్టర్తో వివాహం జరిగిందన్నారు.
వివాహం అయిన తరువాత అమెరికాకు వెళ్లిపోయి అక్కడ 58 రోజులపాటు బాగానే ఉన్నారని తెలిపారు. తరువాత డబీరుద్దీన్ కేవలం అమెరికా వెళ్లేందుకే ఫాతిమాను వివాహం చేసుకున్నట్లు తెలియడంతో ఇద్దరి మధ్య తగాదాలు జరిగాయని తెలిపారు. దీంతో వెంటనే ఆమె భారతదేశానికి వచ్చి అతనిపై కేసులు వేసి చట్టపరంగా విడాకులు తీసుకున్నారని తెలిపారు. ఉద్యోగ నిమిత్తం తిరిగి అమెరికాకు వెల్లిన ఫాతిమాను డబీరుద్దీన్ వేధింపులకు గురిచెయ్యడమే కాకుండా ఆమెపైనే తనను మోసం చేసి అమెరికాకు తీసుకువచ్చిందిని అమెరికాలో తప్పుడు కేసులు పెట్టాడని తెలిపారు.
దీంతో అమెరికా చట్టం ప్రకారం ఆమెపై కేసు నమోదు చేసి డబీరుద్దీన్కే భరణం ఇవ్వాలని చెప్పడంతో గత 10 సంవత్సరాల నుంచి ఫాతిమా ఉద్యోగం చేసుకుంటూ భరణం ఇస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమెపై కేసులు ఉండటంతో ఇండియాకు రాలేని పరిస్థితి ఉందని అటు భరణం ఇవ్వలేక తన పింఛన్ డబ్బులు కూడా పంపించాల్సి వస్తుందని గులాం అఫ్జల్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి తన కుమార్తెను భారత్కు రప్పించాలని, అలానే డబీరుద్దీన్పై కూడా ఇక్కడ తన కూతురు పెట్టిన కేసులు ఉన్నందున అతన్ని కూడా ఇండియాకు రప్పించాలని విజ్ఞప్తి చేశారు.