ఎప్పుడేం జరుగుతుందో? | Excitement in BRS: Telangana | Sakshi
Sakshi News home page

ఎప్పుడేం జరుగుతుందో?

Jun 7 2025 5:47 AM | Updated on Jun 7 2025 5:47 AM

Excitement in BRS: Telangana

తాజా రాజకీయ పరిణామాలపై బీఆర్‌ఎస్‌లో ఉత్కంఠ

కాళేశ్వరం కమిషన్‌ విచారణకు 9న హరీశ్, 11న హాజరవనున్న కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ లోపల, వెలుపల చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలతో పార్టీ కేడర్‌లో ఉత్కంఠ నెలకొంది. పార్టీకి చెందిన ముగ్గురు కీలక నేతలు విచారణ సంస్థల ఎదుట హాజరుకానున్న నేపథ్యంలో విచారణ తర్వాత ఎదురయ్యే పరిణామాలు ఎలా ఉంటాయనే కోణంలో కేడర్‌లో చర్చ జరుగుతోంది. మరోవైపు పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ‘తెలంగాణ జాగృతి’ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకొని శనివారం హైదరాబాద్‌కు చేరుకోనున్న వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వీటన్నింటిపై ఎలా స్పందిస్తారనే చర్చ నడుస్తోంది.

కేసీఆర్‌ విచారణ నేపథ్యంలో పార్టీ కార్యాచరణ ఏమిటో?
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిషన్‌ ఎదుట విచారణకు ఈ నెల 9న హరీశ్‌రావు, 11న కేసీఆర్‌ హాజరుకానున్నారు. ఈ విషయంలో కేసీఆర్‌కు కమిషన్‌ నోటీసులు ఇచ్చినా పార్టీ ఇప్పటివరకు స్పందించక పోవడాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించిన నేపథ్యంలో ఈ నెల 11న బీఆర్‌ఎస్‌ చేపట్టే కార్యాచరణపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ కవిత ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిరసన తెలపడం తెలిసిందే. ఈ నెల 11న కూడా తెలంగాణ జాగృతి ద్వారా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టే యోచనలో కవిత ఉన్నట్లు సమాచారం.

‘ఫార్ములా–ఈ’పై విచారణకు కేటీఆర్‌
‘ఫార్ములా–ఈ’ కారు రేసు అంశంలో గతంలో విచారణకు హాజరైన కేటీఆర్‌కు ఈ నెల 5న రావాల్సిందిగా ఏసీబీ మరోసారి నోటీసు జారీ చేయగా అమెరికా పర్యటన ముగించుకొని వచ్చాక హాజరవుతానని పేర్కొనడం తెలిసిందే. శనివారం హైదరాబాద్‌ చేరుకోనున్న కేటీఆర్‌ ఈ నెల 3వ వారంలో ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. పార్టీ అధినేత కేసీఆర్, మరో కీలక నేత హరీష్‌రావు కాళేశ్వరం కమిషన్‌ విచారణకు హాజరయ్యే సమయంలోనే కేటీఆర్‌కు కూడా నోటీసులు రావడం వెనుక కుట్ర ఉందని బీఆర్‌ఎస్‌ వర్గాలు విమర్శిస్తున్నాయి.

‘కవిత ఎపిసోడ్‌’పైనా పార్టీలో ఉత్కంఠ
ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్‌ కావడం కలకలం సృష్టించింది. గత నెల 23న అమెరికా నుంచి తిరిగి వస్తూ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కేసీఆర్‌కు తాను లేఖ రాసిన విషయాన్ని అంగీకరిస్తూనే ‘కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అంటూ ఆమె వ్యాఖ్యానించారు. 

అలాగే గత నెల 29న కేటీఆర్‌ను లక్ష్యంగా చేసుకొని పరోక్షంగా విమర్శలు గుప్పించారు. పార్టీ జెండా, కండువాలు లేకుండా ఈ నెల 4న ఇందిరా పార్కు వద్ద ధర్నా కూడా చేపట్టారు. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ స్పందన ఎలా ఉంటుందనే ఉత్కంఠ కేడర్‌లో వ్యక్తమవుతోంది. అయితే కేటీఆర్‌ తాజా పరిణామాల జోలికి వెళ్లకుండా కేవలం సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, ప్రభుత్వ వైఫల్యాలపై నిరసనలు వంటి అంశాలపైనే దృష్టి సారించే అవకాశముందని తెలంగాణ భవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement