బీఆర్‌ఎస్‌.. రాం రాం! .. మరి కాంగ్రెస్‌ వైఖరేమిటో? | Election of MLCs of local bodies | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌.. రాం రాం! .. మరి కాంగ్రెస్‌ వైఖరేమిటో?

Apr 20 2025 7:45 AM | Updated on Apr 20 2025 7:45 AM

Election of MLCs of local bodies

ఎంఐఎంకు గెలిచేంత ఓటర్ల సంఖ్య  

బలం లేకున్నా బీజేపీ ధీమా  

రసకందాయంలో ‘స్థానిక’ సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక   

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక రసకందాయంగా మారనుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఎన్నిక జరగనుంది. తగిన బలం లేకపోయినప్పటికీ, బీజేపీ తమ అభ్యరి్థని బరిలో దింపడంతో పోలింగ్‌ అనివార్యంగా మారింది. కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికకు తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్, ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ తమ అభ్యర్థులను పోటీకి దింపలేదు. కాంగ్రెస్‌కు సంబంధించి ఎంఐఎంకు స్నేహహస్తం కోసమే పోటీకి దింపలేదని కూడా ప్రచారంలో ఉంది. అందుకు బలమైన కారణాలే ఉన్నాయి. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలో కలిసిమెలిసి గెలిచిన ఆ రెండు పారీ్టలూ ఈ ఎన్నికలోనూ అదే వైఖరి పాటించనున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే నియోజకవర్గాల ఎమ్మెల్సీల ఎన్నిక సందర్భంగా ఇచి్చన హామీ మేరకు సైతం కాంగ్రెస్‌ రంగంలో దిగలేదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ దూరం.. 
ఎంఐఎంతో విభేదాల్లేని బీఆర్‌ఎస్‌.. ఆ పార్టీకికి మద్దతు ఇస్తుందా, లేక పోలింగ్‌కు గైర్హాజరవుతుందా అని ఆలోచిస్తున్న రాజకీయ పరిశీలకుల ఆలోచనలకు తెర దించుతూ ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తమ పార్టీ పోలింగ్‌ను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు.. విప్‌ జారీ చేస్తామని, ఎవరైనా ధిక్కరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

కాంగ్రెస్‌ దారెటు ? 
ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పోలింగ్‌లో పాల్గొంటుందా, లేక అది సైతం పోలింగ్‌కు దూరంగా  ఉంటుందా? అనే చర్చలు రాజకీయ వర్గాల్లో మొదలయ్యాయి. ఎందుకంటే.. కాంగ్రెస్‌ పోలింగ్‌లో పాల్గొన్నా, పాల్గొనకపోయినా ఎంఐఎంకు వచ్చే నష్టమంటూ ఏమీ లేదు. కాంగ్రెస్‌ ఓటర్లు బీజేపీకి ఓట్లేసే అవకాశం లేదు. మిగిలింది ఎంఐఎం మాత్రమే అయినందున కాంగ్రెస్‌ పోలింగ్‌లో పాల్గొంటే  ఆ పార్టీ మెజార్టీ పెరుగుతుందే తప్ప దానికి ఓటమి అంటూ లేదని చెబుతున్నారు. మొత్తం 112 మంది ఓటర్లలో బీజేపీకి 25 ఓటర్ల బలం ఉండగా, ఎంఐఎం బలం 49గా ఉంది. అంటే దాదాపు రెట్టింపు బలం. కాబట్టి ఎంఐఎం గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.  

అనూహ్య పరిణామం ఏమైనా జరిగేనా? 
ఇదే తరుణంలో అనూహ్యంగా ఏమైనా జరగనుందా ? అన్న ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. అందుకు కారణం ఈసారి ఎలాగైనా ఈ ఎన్నికలో గెలవాలనే తలంపుతోనే బీజేపీ తమ అభ్యర్థిని బరిలో దింపిందని చెబుతున్నారు. అంతే కాదు.. పోలింగ్‌కు సంబంధించి సన్నాహక సమావేశం, మాక్‌పోలింగ్‌ వంటివి సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పారీ్టకి చెందిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మూడూ ఒకటేనన్నారు.  ఎంఐఎంను గెలిపించేందుకే కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పోటీలో లేవని ఆరోపించారు.  కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఓటర్లు ఆత్మ ప్రబోధానుసారం ఓట్లేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు మరో కేంద్రమంత్రి బండి సంజయ్‌ సైతం ఎంఐఎంను ఓడించేందుకు పార్టీలకతీతంగా ఓట్లేయాలని పిలుపునిచ్చారు.  

విప్‌ ఉండదా? 
ఈ నేపథ్యంలోనే తమ పార్టీ పోలింగ్‌ను బహిష్కరిస్తుందని కేటీఆర్‌ చెబుతున్నారు. ఈ ఎన్నిక నిర్వహిస్తున్న జీహెచ్‌ఎంసీ సమాచారం మేరకు అసలు విప్‌ అంటూ ఉండదు. అయినా విప్‌ జారీ చేస్తామనడం పారీ్టవారు కట్టుతప్పకుండా ఉండటానికేనని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. మరోవైపు, బీజేపీ తగిన వ్యూహరచన చేసిందని వినిపిస్తోంది. గెలుస్తామనే ధీమాలోనే ఆ పార్టీ ఉందని, అందుకే ఈ ఎన్నిక కోసమే గ్రేటర్‌ పరిధిలోని ఎంపీలు కిషన్‌రెడ్డితో పాటు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డి సైతం ఎక్స్‌అఫీíÙయో సభ్యులుగా ఓటర్లుగా పేర్లు నమోదు చేయించుకున్నారని చెబుతున్నారు. ఏదేమైనప్పటికీ రోజుకో మలుపుతో ‘స్థానిక’ ఎన్నిక రసకందాయంగా మారింది. పోలింగ్‌ వరకు ఇంకా ఏం  జరగనుందోనన్న వ్యాఖ్యలు సైతం 
వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement