
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మందుబాబులు తాగిన మత్తులో రెచ్చిపోయి హల్చల్ చేశారు. రాత్రి వేళ దారిలో వెళ్తున్న భార్యాభర్తలను అడ్డుకుని.. మహిళను వేధింపులకు గురిచేశారు. నన్నే నీ భర్త అనుకో.. నీ ఫోన్ నెంబర్ ఇవ్వు.. అంటూ వేధించారు. టచ్లో ఉండాలంటూ ఓవరాక్షన్కు దిగారు. అనంతరం, రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురు ఆకతాయిలను అరెస్ట్ చేశారు.
వివరాల ప్రకారం.. ఏపీలోని ఒంగోలుకు చెందిన యువతి (29) తన భర్త, మరిది, ఆడపడుచుతో కలిసి హైదరాబాద్ రహ్మత్ నగర్లోని తమ బంధువుల ఇంటికి వచ్చారు. గురువారం సాయంత్రం ఆ యువతి తన భర్త, మరిది, ఆడపడుచు, బంధువు స్నేహితుడితో కలిసి బేగంపేటలోని క్లబ్–8 పబ్కు వెళ్లారు. రాత్రి 11.40 గంటల సమయంలో పబ్ నుంచి ఇంటికి బయల్దేరారు. ఆ సమయంలో ఆమెను చూసిన ముగ్గురు యువకులు అడ్డగించారు. అప్పుడు తాను తన భర్తతో కలిసి వచ్చానని చెప్పినా మందుబాబులు పట్టించుకోలేదు.
మరింత ఓవరాక్షన్ చేస్తూ.. నన్నే నీ భర్త అనుకో.. ఫోన్ నెంబర్ ఇవ్వు అంటూ వేధింపులకు గురిచేశారు. ఆమె శరీరాన్ని తాకే ప్రయత్నం చేశారు. చేతుల్లో బీర్ బాటిళ్లు పట్టుకుని బెదిరింపులకు దిగారు. అనంతరం, వారిద్దరూ అక్కడి నుంచి వెళ్తుండగా.. బేగంపేట నుంచి రహ్మత్ నగర్కు వచ్చే దాకా వెకిలి చేష్టలతో వెంబడించి వేధింపులకు గురిచేశారు.
అయితే, వివాహితను ఇంట్లో దిగబెట్టిన తర్వాత తన స్నేహితుడిని డ్రాప్ చేసేందుకు భర్త మాదాపూర్ వెళ్తుండగా, ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వారిని అడ్డగించి ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. వారు ప్రయాణించే బైక్తో పాటు ఫోన్లను బలవంతంగా లాక్కున్నారు. దీంతో వారు డయల్ 100కు కాల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గురు యువకులను అరెస్టు చేశారు. వివాహితను వేధించిన వారిని పంజాగుట్టకు చెందిన డి.సంపత్ (28), సందీప్ (28), కూకట్ పల్లికి చెందిన ఉమేష్ (28)లుగా గుర్తించారు. వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.