
రాష్ట్రంలో ఇదీ ప్రస్తుత వాతావరణ పరిస్థితి
మందగమనంలో నైరుతి రుతుపవనాలు
ముందస్తుగా మురిపించి.. సీజన్ వచ్చాక వానలు కరువు
మరో నాలుగు రోజులు ఇదే పరిస్థితి: వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: ముందస్తుగా మురిపించిన నైరుతి రుతుపవనాలు.. రాష్ట్రంలో ప్రస్తుతం కాస్త నెమ్మదించాయి. సాధారణంగా నైరుతి రుతుపవనాల సీజన్ను జూన్ 1వ తేదీ నుంచి సెప్టెంబరు నెలాఖరు వరకు పరిగణిస్తారు. కానీ ఈసారి వారం రోజుల ముందే రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తొలి నాలుగు రోజులు అత్యంత చురుకుగా కదిలాయి. దీంతో పలుచోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీవర్షాలు, ఒకట్రెండు చోట్ల అతిభారీ వర్షాలు సైతం నమోదయ్యాయి. కానీ వాస్తవ సీజన్ ప్రారంభం(జూన్ 1వ తేదీ) నుంచి రుతుపవనాల కదలికలు కాస్త మందగించాయి.
దీంతో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసుకొని ఉష్ణోగ్రతలు పెరిగాయి. సాధారణంగా రోహిణి కార్తె చివర్లో తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ప్రస్తుతం పొద్దంతా ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతూ తీవ్రమైన ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాయంత్రానికి వాతావరణం కాస్త చల్లబడినా వర్షాలు మాత్రం కురవటంలేదు. ఈ నెల తొలి వారంరోజుల్లో 26 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదు కావాల్సి ఉండగా.. అందులో సగం కూడా కురవలేదు.
రెండోవారం తర్వాతే..: ప్రస్తుత వాతావరణ పరిస్థితులు వర్షాలకు అనుకూలంగా లేవు. మరో నాలుగైదు రోజులపాటు ఇదే తరహా వాతావరణం ఉంటుందని వాతావరణ విభాగం అధికారులు చెబుతున్నారు. జూన్ రెండోవారం తర్వాతే వర్షాలకు అనుకూల పరిస్థితులు ఉంటాయని అంటున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం, వాయుగుండం, తుఫాన్ల ప్రభావంతోనే నైరుతి సీజన్ వర్షాలు ఎక్కువ కురుస్తాయి. ఈ సీజన్లో ఇప్పటివరకు బంగాళాఖాతంలో అలాంటి పరిస్థితులు ఏర్పడలేదు.
ప్రస్తుతానికి వాతావరణ శాఖ సైతం ఎలాంటి అంచనాలను విడుదల చేయలేదు. శుక్రవారం రాష్ట్రంలో గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంగానే నమోదయ్యాయి. అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత రామగుండంలో 40 డిగ్రీల సెల్సియస్, అత్యల్ప కనిష్ట ఉష్ణోగ్రత హనుమకొండలో 23ల డిగ్రీ సెల్సియస్గా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు కూడా రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలోనే నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.