ఆమె తలలో బుల్లెట్టా.. ఇనుప ముక్కా? అంతుచిక్కని వైనం! | Dispute Between Brothers Over Property Karimnagar District Crime News | Sakshi
Sakshi News home page

ఆమె తలలో బుల్లెట్టా.. ఇనుప ముక్కా? అంతుచిక్కని వైనం!

Jun 21 2026 1:06 PM | Updated on Jun 21 2026 1:06 PM

Dispute Between Brothers Over Property Karimnagar District Crime News

ఇనుప ముక్క కావచ్చంటున్న పోలీసులు

యధాలాపంగా పోలీసుల దర్యాప్తు

ఆస్తి గొడవలో తపంచాతో కాల్చారా?

కోరుట్ల/మెట్‌పల్లి: వారం క్రితం ఆస్తి కోసం అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ.. ఈ గొడవలో కర్ర తగిలి ఓ మహిళకు తలపై తీవ్ర గాయాలతో రక్తస్రావమైనట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ ఫిర్యాదును యధాలాపంగా తీసుకున్న మెట్‌పల్లి పోలీసులు ఎప్పటిలాగే హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్‌కు పంపారు. ఆ తరువాత సదరు మహిళను ఆసుపత్రికి పంపించారు. 2 రోజులు గడిచినా మహిళ తల నుంచి రక్తస్రావం ఆగలేదు. వైద్యులకు అనుమానం వచ్చి స్కానింగ్‌ చేయించారు. చివరికి ఆమె తలలో ఇనుప ముక్క కనిపించడంతో నివ్వెరపోయారు. కర్రతో చేసిన గాయం అయితే ఇనుప ముక్క ఎక్కడిదన్న విషయం అంతుచిక్కని ప్రశ్నగా మారి కలకలం రేపుతోంది.

వారం క్రితం గొడవ
మెట్‌పల్లి పట్టణంలోని మఠంవాడలో గొనెల రాజం–లక్ష్మి దంపతులు, ఆ పక్కనే అతడి తమ్ముడు గొనెల శంకర్‌, అతడి సమీప బంధువు ముత్తన్న నివాసముంటున్నారు. అన్నదమ్ములకు కొన్ని రోజులుగా ఓ భూపంచాయితీ విషయంలో గొడవలు జరుగుతుండగా.. ఈనెల 15న అర్ధరాత్రి దాటిన తరువాత గొనెల రాజం–లక్ష్మి దంపతులు, గొనెల శంకర్‌కు మళ్లీ గొడవ జరిగింది.

ఈ గొడవలో గొనెల శంకర్‌, ముత్తన్న కలిసి గొనెల రాజం–లక్ష్మి దంపతులపై దాడికి పాల్పడ్డారు. లక్ష్మి తలకు తీవ్ర గాయాలు కావడంతో.. తనను కర్రతో కొట్టి చంపే యత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మెట్‌పల్లి పోలీసులు గొనెల శంకర్‌, ముత్తన్నపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. లక్ష్మి తల నుంచి రక్తస్రావం ఆగకపోవడంతో.. ఈనెల 17న హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి స్కానింగ్‌ తీయగా.. ఆమె తలలో బుల్లెట్టు వంటి ఇనుప ముక్క ఉందని గుర్తించి దాన్ని వెలికితీశారు.

బుల్లెట్టా.. ఇనుప ముక్కా?
లక్ష్మి తలపై కర్రతో దాడి చేస్తే ఆమె కంటి కింది భాగంలో బుల్లెట్టు వంటి ఇనుప ముక్క ఎందుకు దిగబడి ఉందన్న విషయంలో ఎవరికీ అంతుచిక్కడం లేదు. అర్ధరాత్రి తరువాత చీకటిలో జరిగిన గొడవలో లక్ష్మి తనపై దాడికి కర్రను ఉపయోగించారా లేదా అన్న విషయాన్ని స్పష్టంగా గమనించి ఉండకపోవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు ఇనుప ముక్క తపంచా నుంచి వెలువడిన బుల్లెట్టు ముక్క కావచ్చన్న అనుమానాలున్నాయి.

ఇనుప ముక్క బుల్లెట్టు అయితే తపంచా ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయంలో సందేహాలున్నాయి. గొనెల శంకర్‌ వద్ద పని చేసే జేసీబీ డ్రైవర్లు కొందరు బీహార్‌, ఒరిస్సా ప్రాంతానికి చెందినవారు కావడంతో.. అక్కడి నుంచి తపంచా కొనుగోలు చేసి తెచ్చుకున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ ఏదైనా ఇనుప ముక్క అయితే తలలో కంటి కిందుగా లోతుకు ఎలా వెళ్లిందన్న విషయం ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయమై మెట్‌పల్లి సీఐ సురేశ్‌బాబు మాట్లాడుతూ.. తలలో నుంచి బయటపడిన ఇనుప ముక్కను ఫోరెన్సిక్‌ నిపుణుల వద్దకు పంపామని, ఆ తరువాత స్పష్టత వస్తుందని చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement