నేటి నుంచి డీసీహెచ్బీ సర్వే నెలరోజుల పాటు సాగనున్న ప్రక్రియ అభివృద్ధి ప్రణాళికలకు దోహదం గ్రామాలకు విలేజ్, పట్టణాలకు టౌన్ డైరెక్టరీ
కరీంనగర్ అర్బన్: గ్రామ, పట్టణాల వివరాలను సమగ్ర సమాచారంతో డీసీహెచ్బీ(డిస్ట్రిక్ట్ సెన్సెస్ హ్యాండ్ బుక్) రూపొందించేందుకు కేంద్ర, రాష్ట్ర గణాంకశాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. విలేజ్, టౌన్ డైరెక్టరీలను వేర్వేరుగా రూపొందించనుండగా నేటి నుంచి సర్వే ప్రారంభమై వచ్చే నెల 10వరకు కొనసాగనుంది. గ్రామాల్లో రెవెన్యూ గ్రామం వారీగా, పట్టణాల్లో వార్డు వారీగా వివరాలు ఆన్లైన్లో నమోదు చేయనున్నారు. ప్రధానంగా 8అంశాలపై సమగ్ర సమాచారం పొందుపరచాల్సి ఉంటుంది. ఇప్పటికే సంబంధిత సిబ్బందికి శిక్షణ ఇవ్వగా మున్సిపల్, మండలాల వారీగా డిస్ట్రిక్ట్ ఆడిషనల్ సెన్సెస్ ఆఫీసర్ వెల్ది కిషన్రావు ఆధ్వర్యంలో నె ల రోజుల పాటు జరిగే సర్వేలో గ్రామ, పట్టణస్థా యి అధికారులు కీలక భూమిక పోషించనున్నారు.
మండలాలకు తహసీల్దార్.. మున్సిపల్కు కమిషనర్
సర్వేను పర్యవేక్షణ చేసేందుకు అధికారులకు బాధ్యతలు అప్పగించారు. రెవెన్యూ గ్రామ పంచాయతీ కేంద్రంగా జీపీవో లేదా కార్యదర్శి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. పట్టణాల్లో వార్డు ఆఫీసర్లు వివరాలను ఆన్లైన్లో క్రోడీకరించనున్నారు. మండలస్థాయిలో తహసీల్దార్, మున్సిపల్లో మున్సిపల్ కమిషనర్ చార్జ్ ఆఫీసర్లుగా వ్యవహరిస్తారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ డిస్ట్రిక్ట్ ప్రిన్సిపల్ సెన్సెస్ ఆఫీసర్గా ఆడిషనల్ సెన్సెస్ ఆఫీసర్లుగా అదనపు కలెక్టర్లు, డీఆర్వో, ఏవో, ఎస్వో వ్యవహరించనున్నారు. నెల రోజుల పాటు జరిగే ప్రక్రియలో ర్యాండమ్ వెరిఫికేషన్ చేయనున్నారు. గ్రామాలకు విలేజ్ రిజిష్టర్, పట్టణాలకు టౌన్ రిజిష్టర్లో వివరాలను నమోదు చేయనున్నారు.
అభివృద్ధి ప్రణాళికలకు దోహదం
ప్రతి జనగణన సందర్భంగా ఈ ప్రక్రియ చేపడుతుంటారు. 2011లో జనగణన జరగగా అప్పటి పరిస్థితులకు ఇప్పటికీ తేడా స్పష్టమవనుంది. గ్రామాలు, పట్టణాల్లో ఉన్న కనీస సౌకర్యాలు, సదుపాయాలు, విద్య, వైద్యం, రవాణా, వ్యవసాయ, వృత్తి పనులు, టెక్నాలజీ, తదితర వివరాల సేకరణలో ఇది ఎంతో కీలకం. ఈ డిజిటల్ నమోదు ద్వారా ప్రతి రెవెన్యూ గ్రామం, పట్టణంలో వార్డు వారీగా సమస్త సమాచారం అందుబాటులో ఉండనుంది. వివరాల నమోదు పూర్తయిన తరువాత సకల సమాచారంతో డిస్ట్రిక్ట్ సెన్సెస్ హ్యాండ్ బుక్ విడుదల కానుంది.
జిల్లా జనాభా: 10,49,140
గ్రామ పంచాయతీలు: 318
రెవెన్యూ గ్రామాలు: 195
నగరపాలక సంస్థ: 01(కరీంనగర్)
మున్సిపాలిటీలు: 3
(హుజూరాబాద్, జమ్మికుంట,చొప్పదండి)
సాగుదారులు: 78,516
వ్యవసాయ కూలీలు: 1,86,363
కుటీర పరిశ్రమలు: 61,869
ఇతర రంగాలు: 1,80,347


