‘సాక్షి’ కథనానికి స్పందించిన జలమండలి
సాక్షి, హైదరాబాద్: మహా హైదరాబాద్కు తాగునీరు అందించే జంట జలాశయాల్లో కలిసే మురుగు నాలాలను జలమండలి అధికారులు పరిశీలించారు. ఆదివారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘హిమాయత్ సాగర్... ఉస్మాన్సాగర్ మరో హుస్సేన్ సాగర్!’అనే కథనానికి జలమండలి స్పందించింది. దీంతో జలమండలి టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్ ఆధ్వర్యంలో ట్రాన్స్మిషన్ సీజీఎంతోపాటు ఇతర అధికారుల బృందం హిమాయత్నగర్ గ్రామ పరిధిలో ఉస్మాన్సాగర్ జలాశయంలో కలిసే మురుగు నాలా, దాని ప్రవాహం, పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఉస్మాన్సాగర్ జలాశయంలోకి చేరే నీటి నాణ్యతను పరిరక్షించేందుకు నాలా ద్వారా వచ్చే మురుగునీటిని శుద్ధి చేసిన తర్వాతే విడుదలయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జంట జలాశయాల్లోకి మురుగునీరు, ఇతర కాలుష్య కారకాలు చేరకుండా దీర్ఘకాలిక పరిష్కారంలో భాగంగా సమగ్ర సీవరేజ్ డీపీఆర్ రూపొందించినట్లు జలమండలి వివరణ ఇచ్చింది. తక్షణ చర్యల్లో భాగంగా కొత్వాల్గూడ, నాగిరెడ్డిగూడ, హిమాయత్నగర్, జన్వాడల్లో మొత్తం 20 ఎంఎల్డీ సామర్థ్యంతో ఎస్టీపీల నిర్మాణం చేపట్టినట్లు, వీటిని రెండు నెలల్లో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది.


