రమ్యను మర్చిపోయారా?.. పదేళ్లైనా న్యాయం దక్కలేదు! | 10 Years After Hyderabad's Ramya Drunk Driving Tragedy And Family Still Awaits Justice, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

రమ్యను మర్చిపోయారా?.. పదేళ్లైనా న్యాయం దక్కలేదు!

Jul 1 2026 9:08 AM | Updated on Jul 1 2026 10:15 AM

A Decade Later Hyderabad Ramyas Family Still Waits for Justice

"ఆ రోజు మా జీవితాలను చీకటిలోకి నెట్టేసింది... కానీ పదేళ్లు గడిచినా న్యాయం మాత్రం దక్కలేదు.".. ఓ కుటుంబం ఆవేదన. 2016 జూలై 1... తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటన జరిగిన రోజు. మద్యం మత్తులో వేగంగా దూసుకొచ్చిన కారు ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. 10 ఏళ్ల చిన్నారి రమ్య, ఆమె బాబాయి, తాత.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ ప్రమాదంలో చనిపోయిన వారి జ్ఞాపకాలు మాత్రమే కాదు.. న్యాయం కోసం ఆ కుటుంబం ఎదురుచూస్తున్న బాధ కూడా ఇప్పటికీ అలాగే ఉంది.

2016 జూలై 1న బంజారాహిల్స్‌ ప్రాంతంలో మద్యం మత్తులో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ దాటి ఎదురుగా వస్తున్న వాహనంపై పడింది. ఆ ప్రమాదంలో నాలుగో తరగతి చదువుతున్న 10 ఏళ్ల చిన్నారి రమ్య తీవ్రంగా గాయపడింది. ఆమె బాబాయి రాజేశ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. రమ్య కొద్ది రోజుల తర్వాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. గాయాల కారణంగా ఆమె తాత మధుసూదనాచారి కూడా కన్నుమూశారు. ఒకే ప్రమాదంలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై అప్పట్లో దేశవ్యాప్త చర్చ
ఈ కేసులో నిందితులంతా 20 ఏళ్ల లోపే కావడం.. అదీ ఇంజనీరింగ్‌ విద్యార్థులు కావడం గమనార్హం. రమ్య కేసు తర్వాత హైదరాబాద్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై విస్తృత చర్చ జరిగింది. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, పబ్‌ల నియంత్రణను మరింత కఠినతరం చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. తాగి వాహనాలు నడపకండంటూ తెలుగు రాష్ట్రాల్లో ఫ్లకార్డులతో జనాలు రోడ్డెక్కి నిరసనలు చేశారు. పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించినప్పటికీ.. ఇలాంటి ప్రమాదాలు పూర్తిగా ఆగలేదు.

పదేళ్లలో ఒక్కసారే విచారణ?
ఈ కేసులో న్యాయం కోసం పదేళ్లుగా పోరాడుతున్నామని బాధిత కుటుంబం చెబుతోంది. కానీ ఈ పదేళ్లలో కోర్టులో కేవలం ఒక్కసారి మాత్రమే విచారణ జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు విచారణ ముందుకు సాగకపోవడం, తరచూ వాయిదాలు పడుతుండటంతో న్యాయం ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి నెలకొన్నదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు.అయితే దీనిపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.

విదేశాల్లో నిందితుడు.. అదో మిస్టరీ!
ఈ కేసులో శ్రవిల్‌, విష్ణు వినీత్‌లు  ప్రధాన నిందితులుగా ఉన్నారు. వెంట మరో నలుగురు కుర్రాళ్లు ఉన్నప్పటికీ.. వాళ్ల గురించి స్పష్టత లేదు. అయితే కేసు తర్వాత విష్ణు వినీత్‌ విదేశాలకు పారిపోయాడని.. అతన్ని తిరిగి భారత్‌కు తీసుకురావడానికి పోలీసులు చర్యలు చేపట్టినట్లు పలుమార్లు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు స్పష్టమైన ఫలితం కనిపించలేదని కుటుంబ సభ్యులు అంటున్నారు. నిందితుడిని భారత్‌కు తీసుకొచ్చి చట్టం ముందు నిలబెట్టాలన్న తమ డిమాండ్‌ ఇప్పటికీ నెరవేరలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'ప్రతీకారం కాదు.. న్యాయం కావాలి'
పదేళ్లు గడిచినా రమ్య జ్ఞాపకాలు ప్రతి రోజూ వెంటాడుతున్నాయని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తమకు ఎవరిపైనా ప్రతీకారం అవసరం లేదని.. కానీ చట్టం తన పని చేసి బాధ్యులకు శిక్ష పడాలని మాత్రమే కోరుకుంటున్నామని అంటున్నారు. కేసు విచారణను వేగవంతం చేసి నిందితులను చట్టం ముందు నిలబెట్టాలని ప్రభుత్వాన్ని, న్యాయవ్యవస్థను వారు కోరుతున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement