20 ఏళ్లూ కాంగ్రెస్‌ పాలనే | Construction of Indiramma houses soon Says Mallu Bhatti Vikramarka | Sakshi
Sakshi News home page

20 ఏళ్లూ కాంగ్రెస్‌ పాలనే

Aug 8 2024 5:37 AM | Updated on Aug 8 2024 5:37 AM

Construction of Indiramma houses soon Says Mallu Bhatti Vikramarka

బాధ్యతగా నడుచుకుంటున్నాం 

త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం 

ప్రాణహిత– చేవెళ్ల పనుల పున:ప్రారంభం 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సాక్షి, ఆదిలాబాద్‌: ‘అధికారం అందివచ్చిందని అనుభవించాలని అనుకోలేదు.. ఒక బాధ్యతగా నడుచుకుంటున్నాం. ఆర్థిక ఇబ్బందులున్నా, హామీలు అమలు చేస్తాం. 20 ఏళ్లు కాంగ్రెస్సే పాలిస్తుంది’అని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క అన్నారు. ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం పీప్రీ గ్రామంలో బుధవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ‘ఎన్నికలకు ముందు ఏఐసీసీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర ఇక్కడి నుంచే ప్రారంభించాను. సీఎలీ్పనేతగా నేను ఓ వైపు.. నాటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మరోవైపు ఆదిలాబాద్‌ జిల్లా నుంచే యాత్రలు ప్రారంభించాం.

ఆ పాదయాత్రలో ప్రజల గుండెచప్పుడు విన్నాం. చెప్పిన సమస్యల పరిష్కారానికి కంకణబద్ధులమై ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చాం. ఇప్పటివరకు అనేక హామీలు అమలు చేశాం. మొదటి సంవత్సరంలోనే ప్రతీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. రూ.5లక్షలు ఖర్చు చేసి రెండు పడకలతో ఇల్లు నిర్మిస్తాం. ఎస్సీ, ఎస్టీలకు అదనంగా రూ.లక్ష జత చేసి ఇస్తాం. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే 30వేల ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చాం. మరో 35వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ చివరిదశకు చేరుకుంది. త్వరలోనే వారికి నియామక పత్రాలు అందజేస్తాం’అని భట్టి వివరించారు.  

గత పదేళ్లలో ఐటీడీఏ నిర్వీర్యం 
గత పదేళ్లు పాలించినవారు ఐటీడీఏలను నిరీ్వర్యం చేశారని డిప్యూటీ సీఎం భట్టి ఆరోపించారు. ‘పాదయాత్రలో గిరిజనులు నాకు ఈ విషయం చెప్పారు. ఐటీడీఏల కోసం తాజా బడ్జెట్‌లో రూ.17వేల కోట్లు కేటాయించాం. గిరిజన యువతకు చదువు చెప్పించడం, నైపుణ్యం కల్పించడం, డ్వాక్రా సంఘాల ద్వారా ఆర్థిక అభివృద్ధిని సాధించేందుకు కృషి చేస్తాం. తుమ్మిడిహెట్టి ఆగిపోయింది. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు సాగునీరు అందడం లేదు.

నాటి సీఎం వైఎస్‌.రాజశేఖరరెడ్డి ప్రారంభించిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్ట్‌ పనులను పున:ప్రారంభించి ఈ జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా సాగునీటి ప్రాజెక్టులకు బడ్జెట్‌లో రూ.400 కోట్లు కేటాయించాం’అని భట్టి చెప్పారు. సభలో ఎమ్మెల్యేలు ప్రేమ్‌సాగర్‌రావు, వెడ్మ బొజ్జు పటేల్, అనిల్‌జాదవ్, ఆదిలాబాద్‌ కలెక్టర్‌ రాజర్షిషా, ఎస్పీ గౌస్‌ ఆలం, ఐటీడీఏ పీఓ ఖుష్బూగుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement