అత్యవసర సేవల ఉద్యోగుల 'సెలవులు రద్దు' | CM Revanth says Holidays cancelled for emergency services employees | Sakshi
Sakshi News home page

అత్యవసర సేవల ఉద్యోగుల 'సెలవులు రద్దు'

May 8 2025 12:59 AM | Updated on May 8 2025 12:59 AM

CM Revanth says Holidays cancelled for emergency services employees

సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో వేం నరేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, రవిగుప్తా తదితరులు

ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో సీఎం రేవంత్‌ సమీక్ష

మంత్రులు, అధికారులంతా హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండాలి 

ప్రభుత్వ ఉద్యోగులు, మీడియా, సోషల్‌ మీడియాలో అనవసర ప్రకటనలు చేయొద్దు 

మనమంతా సైన్యంతోనే అన్న సందేశం ఇవ్వాలన్న ముఖ్యమంత్రి 

కీలక ప్రాంతాల్లో భద్రతా చర్యలకు సీఎం, డిప్యూటీ సీఎం ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో అత్యవసర సేవలు అందించే అన్ని విభాగాల ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అలాగే మంత్రులు, అధికారులు విదేశీ పర్యటనలు రద్దు చేసుకుని హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండాలని ఆదేశించింది. పాకిస్తాన్‌లో ఉగ్రవాద శిబిరాలపై మంగళవారం అర్ధరాత్రి భారత సైన్యం ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ఐసీసీసీ)లో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 

త్రివిధ దళాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ దాడుల నేపథ్యంలో మనమంతా సైన్యంతో ఉన్నామనే సందేశం ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ సమయంలో రాజకీయాలకు, పార్టీలకు తావు లేదని అన్నారు. మీడియా, సోషల్‌ మీడియాలో ప్రభుత్వ ఉద్యోగులు అనవసర ప్రకటనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం హెచ్చరించారు. 

ప్రజల కోసం 24/7 టోల్‌ ఫ్రీ నంబర్‌ 
‘సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండేలా టోల్‌ ఫ్రీ నంబర్‌ వెంటనే ఏర్పాటు చేయాలి. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. మూడు కమిషనరేట్లకు సంబంధించిన సీసీటీవీలను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు అనుసంధానించాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుంచి వచ్చి అనధికారికంగా నివసిస్తున్న వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలి. శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలి.  

రక్తం, ఆహారం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి 
బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం రెడ్‌ క్రాస్‌తో సమన్వయం చేసుకోవాలి. అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. ప్రైవేటు ఆస్పత్రుల్లో పడకల అందుబాటుపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకోవాలి. ఆహార నిల్వలు కూడా తగినంత ఉండేలా చూడాలి. సైబర్‌ దాడులు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. ఫేక్‌ న్యూస్‌ ప్రచా రం చేసే వారిపై ఉక్కు పాదం మోపాలి. ఫేక్‌ న్యూస్‌ వల్ల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటిని అరికట్టడానికి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలి.  

కీలక ప్రాంతాల్లో భద్రత పెంచాలి 
అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సున్నిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండటంతో పాటు భద్రత పెంచాలి. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం, అన్ని విదేశీ రాయబార కార్యాలయాలు, ఐటీ సంస్థల దగ్గర కూడా భద్రత పెంచాలి. నగరంలో పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే పీస్‌ కమిటీలతో మాట్లాడాలి. హిస్టరీ షీటర్లు, పాత నేరస్తుల విషయంలో పోలీస్‌ విభాగం అప్రమత్తంగా ఉండాలి..’అని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

విదేశీ పర్యాటకులకు రక్షణ కల్పించండి 
హైదరాబాద్‌లోని ఆర్మీ, నేవీ, వైమానిక కార్యాలయాలు, రక్షణ రంగ సంస్థల దగ్గర భద్రతాపరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పోలీసులను ఆదేశించారు. నగరంలో మాక్‌ డ్రిల్‌ అనంతర పరిస్థితులపై అధికారులతో వారు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించాలని చెప్పారు. తెలంగాణ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులకు తగిన రక్షణ కల్పించాలని చెప్పారు. కేంద్ర నిఘా బృందాలతో , రాష్ట్ర నిఘా బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించారు.  

చంపినా చూస్తూ ఊరుకుంటే ఎలా..?  
ఐసీసీసీ వద్ద ఎండలో నిలబడిన మీడియాను చూసిన రేవంత్‌రెడ్డి తన వాహనం ఆపి వారితో ముచ్చటించారు. ‘భారత రక్షణ రంగంలో హైదరాబాద్‌ అత్యంత కీలక ప్రాంతం. అన్ని విభాగాలను అప్రమత్తం చేశాం. దేశంలోకి వచ్చి చంపుతుంటే చూస్తూ ఊరుకుంటే ఎలా? ’అని వ్యాఖ్యానించారు.

సైన్యానికి సెల్యూట్‌: సీఎం రేవంత్‌ 
ఆపరేషన్‌ సిందూర్‌లో భారత సాయుధ దళాలు సాధించిన విజయంపై సీఎం రేవంత్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మన సైన్యం దేశ ప్రజలందరినీ గర్వపడేలా చేసిందని పేర్కొన్నారు. ‘ఒక భారతీయ పౌరుడిగా, నేను ముందుగా మన సాయుధ దళాలకు బలమైన అండగా నిలుస్తున్నా. ఉగ్రవాద నిర్మూలన దిశగా భారత సైన్యం చేపట్టిన ఈ ధైర్యవంతమైన చర్య దేశ భద్రతకు నిదర్శనం. ఈ దాడులు మన సైన్యం సామర్థ్యం, ధైర్యాన్ని ప్రపంచానికి స్పష్టంగా చాటాయి. మనమంతా ఒకే గొంతుకై, ఒకే స్వరంతో ప్రకటిద్దాం.. జై హింద్‌..’అని సీఎం తన ‘ఎక్స్‌’ఖాతాలో పోస్టు చేశారు.  

నేడు సంఘీభావ ర్యాలీ 
భారత సైన్యానికి సంఘీభావంగా హైదరాబాద్‌లో గురువారం సాయంత్రం 6 గంటలకు ర్యాలీ నిర్వహించాలని సీఎం నిర్ణయించారు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సచివాలయం నుంచి నెక్లెస్‌ రోడ్‌ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర నేతలు పాల్గొననున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement