
సాక్షి, హైదరాబాద్: పేదోళ్ల ఇళ్ల కూల్చడానికి హైడ్రా తెచ్చామని కొందరు ఆరోపణలు చేస్తున్నారని.. హైడ్రా అనేది కేవలం కూలగొట్టడానికి కాదని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గురువారం ఆయన హైడ్రా పోలీస్స్టేషన్ ప్రారంభత్సోవ సభలో మాట్లాడుతూ.. చెరువులను ఆక్రమించిన వారు ఎంత పెద్దవారైనా వదలం అని స్పష్టం చేశారు. పేదలు తమ కాలనీల వైపు రాకుండా కొందరు బలవంతులు అడ్డుగా గోడలు కడుతున్నారు. ఆక్రమణదారులను అడ్డుకోవడానికే హైడ్రా’’ అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
‘‘960 చెరువులు ఉండాల్సి ఉండగా, 461 చెరువులు కబ్జాలో ఉన్నాయి. నాలాల ఆక్రమణవల్లే రోడ్లపై నీరు నిలిచిపోతోంది. లేక్వ్యూల పేరుతో చెరువుల్లోనే విల్లాలు కడుతున్నారు. ఎవరూ అడగకుండా ఉంటే భవిష్యత్తులో ఏమవుతుందో అర్థం చేసుకోండి. చెరువులు, నాలాలు ఆక్రమించుకున్న వారికే హైడ్రా అంటే భయం. ఈ నగరాన్ని ఇలాగే నిర్లక్ష్యానికి బలిచేద్దామా?. చిన్న వర్షానికే ఉస్మానియా ఆసుపత్రి మునిగిపోయింది. మమ్మల్ని వ్యతిరేకించినా, దూషించినా నేను పట్టించుకోను’’ అని రేవంత్ తేల్చి చెప్పారు.
‘‘కడుపు నిండా విషం నింపుకుని వ్యవహరిస్తున్నారు. ప్రకృతిని కాపాడుకుందామంటే వీళ్లకు ఇబ్బంది వస్తోంది. రోడ్లపై ఉన్న నిర్మాణాలు కూలిస్తే నగరానికి మంచిది కాదా?. చెరువులను కాపాడి, మూసీని ప్రక్షాళన చేస్తే ప్రకృతిని కాపాడినట్టు కదా?’’ అంటూ రేవంత్ ప్రశ్నించారు.