హైదరాబాద్: ఫ్రాంక్ఫర్ట్ నుండి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వస్తున్న లుఫ్తాన్సా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఎయిర్పోర్ట్లో కలకలం రేగింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో విమానాశ్రయ అధికారులకు ఒక అనామక ఈమెయిల్ అందింది. ఆ ఈమెయిల్లో విమానంలో బాంబు ఉందని, అది ల్యాండింగ్ కావడానికి ముందే ఏ క్షణమైనా పేలిపోయే అవకాశం ఉందని దుండగులు పేర్కొన్నారు. ఈ సమాచారంతో విమానాశ్రయ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది.
సమాచారం అందుకున్న వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది, ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. విమానం సురక్షితంగా ల్యాండ్ అయిన వెంటనే దానిని ప్రత్యేక ఐసోలేషన్ బేకు తరలించారు. అనంతరం బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, కేంద్ర పారిశ్రామిక భద్రతా దళ సిబ్బంది రంగంలోకి దిగి విమానంలో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ప్రయాణికులను సురక్షితంగా దించి, వారి లగేజీతో పాటు విమానంలోని ప్రతి భాగాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
చివరకు విమానంలో ఎటువంటి అనుమానాస్పద వస్తువులు లభించకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ బాంబు బెదిరింపు కేవలం ఒక నకిలీ (ఫేక్) ఈమెయిల్ గా అధికారులు నిర్ధారించారు. ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ఢోకా లేదని స్పష్టం చేసిన శంషాబాద్ విమానాశ్రయ అధికారులు, ఈ నకిలీ ఈమెయిల్ పంపిన గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
A bomb threat email was received for a Lufthansa flight arriving at Shamshabad from Frankfurt. At midnight yesterday, after an email was received stating that there was an unmanned bomb on board that could explode at any moment before landing, security personnel at Shamshabad… pic.twitter.com/BqG5fGVA6W
— IANS (@ians_india) June 13, 2026


