సాక్షి, వరంగల్: వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ కోల శంకర్ గౌడ్ పెట్రోలు పోసుకుని నిప్పంటించుకుని చికిత్స పొందుతూ మరణించిన ఘటనపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
బండి సంజయ్ మాట్లాడుతూ.. శంకర్ గౌడ్ మరణం ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. ఆర్టీసీ కార్మికులు ఎన్నో సమస్యలతో అల్లాడుతున్నారు. కానీ రెండేళ్లుగా ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేయడం, వారిని బెదిరింపులకు గురిచేయడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రామచంద్రరావు మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులకు అండగా నిలవాలని బీజేపీ నిర్ణయించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో నేడు(శుక్రవారం) నర్సంపేటలో జరగనున్న శంకర్ గౌడ్ అంత్యక్రియలకు బండి సంజయ్ హాజరుకానున్నారని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులెవరూ ఆత్మహత్యలకు పాల్పడొద్దని బీజేపీ నేతలు కార్మికులకు విజ్ఝప్తి చేశారు


