
నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్షా
సాక్షి, నిజామాబాద్: పసుపు రైతుల దశాబ్దాల కల అయిన పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే ధనపాల్ సూర్యనారాయణ తదితరులు హాజరయ్యారు. పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం అనంతరం పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో పసుపు ఉత్పత్తులను అమిత్ షా పరిశీలించారు.
కిసాన్ సమ్మేళన్(రైతు సమ్మేళనం) బహిరంగ సభలో అమిత్ షా మాట్లాడుతూ.. దేశ ప్రజలను ఆరోగ్యంగా ఉంచడంలో పసుపు రైతులు కీలక పాత్ర వహిస్తున్నారన్నారు. పసుపు రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. ఈ సందర్భంగా దేశంలోని పసుపు రైతులకు ఆయన అభినందనలు తెలిపారు. పసుపు బోర్డు వల్ల ప్రపంచంలోనే పలు దేశాలకు నిజామాబాద్ పసుపు వెళ్తుందన్న అమిత్ షా.. కొనుగోలు, రవాణా, ఎగుమతి అన్నీ పసుపు బోర్డు చూసుకుంటుందన్నారు. పసుపును ప్రపంచం అద్భుత ఔషధంగా చూస్తుందని అమిత్ షా అన్నారు.
‘‘ఒక బిలియన్ డాలర్లు విలువ చేసే పసుపును ఎగుమతి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతులకు మంచి ధర రావాలన్నదే మా లక్ష్యం. నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, మెట్పల్లిలో పసుపును అధికంగా పండిస్తారు. రైతులకు బోర్డు ద్వారా నూతన సాగు విధానంపై శిక్షణ ఇస్తాం. పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం కట్టుబడి ఉంది. తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాకుండా బోర్డు ఛైర్మన్గా తెలంగాణ వ్యక్తినే నియమించాం. పసుపు బోర్డు కోసం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడారు’’ అని అమిత్ షా ప్రశంసించారు.
‘‘ఆపరేషన్ సిందూర్తో పాకిస్థాన్కు గట్టిగా బుద్ధి చెప్పాం. పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదులను హతమార్చాం. ఆపరేషన్ సిందూర్పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారు. పాకిస్థాన్ మాట రాహుల్ గాంధీ నోట వినపడుతోంది. గత కాంగ్రెస్ సర్కార్ పాక్ విషయంలో మెతుక వైఖరి అవలంబించింది. మోదీ సర్కార్ ఈ పదేళ్లలో మూడుసార్లు పాక్కు భారత్ తడాఖా ఏంటో చూపింది.
ఆపరేషన్ కగార్ చేయాలా? వద్దా..?. లొంగిపోవాలని హెచ్చరించినా లొంగిపోలేదు.. కాబట్టే ఆపరేషన్ కగార్ చేపట్టాం. 2026 నాటికి మావోయిస్ట్ ముక్త్ భారత్. బీఆర్ఎస్ సర్కార్ ఎలాంటి అవినీతికి పాల్పడిందో మీకు తెలుసు. కాళేశ్వరం బీఆర్ఎస్కు ఏటీఎం అయితే.. ఇక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీకి ఏటీఎంగా తయారైంది. తెలంగాణా జనం బీఆర్ఎస్ జెండా పీకి పారేశారు. ఇక్కడ కాంగ్రెస్కు కూడా నూకలు చెల్లే రోజు వస్తోంది’’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
