రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల జరిమానా | Rice millers fined Rs 10 crore | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల జరిమానా

Jun 23 2023 1:34 AM | Updated on Jun 23 2023 1:50 PM

Rice millers fined Rs 10 crore - Sakshi

సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 36 మంది రా రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల మేరకు జరిమానా విధించామని అదనపు కలెక్టర్‌ ఎన్‌.ఖీమ్యానాయక్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో గురువారం రైస్‌మిల్లర్లతో సమీక్షించిన అనంతరం 2020–2021 వానాకాలానికి సంబంధించి డిఫాల్ట్‌ అయిన రా రైస్‌మిల్లర్లకు జరిమానా విధించినట్లు వివరించారు.

12 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి సకాలంలో ఇవ్వలేదని, గడువులోగా ఇవ్వని 36 మంది రైస్‌మిల్లర్లకు రూ.10 కోట్ల జరిమానా విధిస్తూ.. తక్షణమే రూ.2 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. 2022–2023 వానాకాలానికి సంబంధించి కస్టమ్‌ మిల్లింగ్‌ డెలివరీపై ఖీమ్యానాయక్‌ ఆరా తీశారు. 1,46,341 మెట్రిక్‌ టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 6,931 మెట్రిక్‌ టన్నులు మాత్రమే సరఫరా చేశారని పౌరసరఫరాల అధికారులు వెల్లడించారు.

సాధ్యమైనంత తొందరగా సీఎమ్మార్‌ను పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ ఆదేశించారు. డీఎస్‌వో ఎస్‌.జితేందర్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ జీఎం జితేంద్రప్రసాద్, రైస్‌మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బ నాగరాజు, రైస్‌మిల్లర్లు గరిపెల్లి ప్రభాకర్, చేపూరి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement