మాజీ డీజీపీకి జైలు శిక్ష ఖరారు | - | Sakshi
Sakshi News home page

మాజీ డీజీపీకి జైలు శిక్ష ఖరారు

Feb 13 2024 1:40 AM | Updated on Feb 14 2024 10:59 AM

రాజేష్‌ దాస్‌ (ఫైల్‌) - Sakshi

రాజేష్‌ దాస్‌ (ఫైల్‌)

సాక్షి, చైన్నె: విధుల్లో ఉన్న మహిళా ఐపీఎస్‌ అధికారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో తమిళనాడుకు చెందిన మాజీ స్పెషల్‌ డీజీపీ రాజేష్‌ దాస్‌కు విల్లుపురం జిల్లా మొదటి మేజిస్ట్రేట్‌ కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. కింది కోర్టు విధించిన మూడేళ్లు జైలు శిక్షను న్యాయమూర్తి పూర్ణిమ సోమవారం ధ్రువీకరించారు. అయితే అప్పీల్‌కు అవకాశం కల్పిస్తూ మూడు నెలలు గడువు కేటాయించారు.

వివరాలు.. 2021 సంవత్సరం ఫిబ్రవరిలో ప్రత్యేక డీజీపీగా ఉన్న రాజేష్‌ దాస్‌ విధుల్లో ఉన్న జూనియర్‌ మహిళా ఐపీఎస్‌ అఽధికారిణిని తన కారులో ఎక్కమని ఆదేశించి, చివరకు ఆమైపె లైంగిక వేధింపులకు పాల్పడినట్టుగా వెల్లడైన సమాచారం హోంశాఖలో తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈకేసులో గత ఏడాది విల్లుపురం నేరవిభాగం కోర్టు తీర్పు వెలువరించింది. రాజేష్‌దాస్‌కు మూడేళ్లు జైలు శిక్ష విధించారు. అలాగే మహిళా అధికారిణిని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనివ్వకుండా అడ్డుకున్నారని ఐపీఎస్‌ అధికారి కన్నన్‌కు రూ. 500 జరిమానా విధించారు.

తనకు పడ్డ శిక్షను వ్యతిరేకిస్తూ రాజేష్‌ దాస్‌ అప్పీలు పిటిషన్‌ దాఖలు చేశారు. ఇది విల్లుపురం జిల్లా మొదటి మేజిస్ట్రేట్‌కోర్టులో విచారణలో ఉన్న సమయంలో కోర్టును మార్చాలని అప్పీల్‌కు రాజేష్‌ దాష్‌ వెళ్లారు. అయితే ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విల్లుపురం కోర్టులోనే విచారణను ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో గత వారం రోజులుగా విల్లుపురం కోర్టులో వాదనలు, విచారణ జరిగింది. సోమవారం న్యాయమూర్తి పూర్ణిమా తీర్పు వెలువరించారు. కింది కోర్టు విధించిన జైలు శిక్షను ధ్రువీకరించారు. అయితే అప్పీల్‌కు అవకాశం కల్పిస్తూ 3 నెలలు గడువు కేటాయించి కేసును ముగించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement