
వివాహవేడుకలో సీఎం స్టాలిన్ తదితరులు
సాక్షి, చైన్నె: కేంద్ర అసంబద్ధ విధానాల వల్ల దేశం అధోగతి పాలవుతోందని సీఎం స్టాలిన్ విమర్శించారు. ఆదివారం చైన్నెలో డీఎంకే నేత మనోహర్ ఇంటి శుభ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన సభకు ఆయన హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడుతూ.. ఈ వేడుకకు హాజరు అయ్యే గొప్ప అవకాశం లభించినందుకు సంతోషిస్తున్నానని పేర్కొన్నారు. మనోహర్ ఇంటి ప్రతి వేడుక తన చేతుల మీదుగా జరిగినట్టు గుర్తు చేశారు. తనకు రక్షకుడు లాంటి వాడు మనోహరన్ అని కొనియాడారు. సమాజమే కుటుంబం, కుటుంబమే సమాజం అని వ్యాఖ్యలు చేస్తూ, ఈ రోజు దేశ పరిస్థితులు ఏ మేరకు అధ్వానంగా మారుతున్నాయో వివరించారు.
నాడు వ్యతిరేకత...నేడు మద్దతా..?
ఒకే దేశం – ఒకే ఎన్నికల అమలు కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఉన్నారని, దీనికి చైర్మన్గా భారత ప్రథమ పౌరుడిగా ఇది వరకు ఉన్న రామ్నాథ్ కోవింద్ను నియమించి, ఆయనతో రాజకీయ కార్యక్రమాలు చేపట్టడంపై మండి పడ్డారు. దేశంలో అంతా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని, పరిస్థితులు చక్క దిద్దేందుకు ఇండియా కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. అయితే, జమిలీ ఎన్నికలతో దేశంలోకి నియంత పాలన, నియంత్రత్వానికి ప్రధాని నరేంద్రమోదీ కుట్ర పన్నారని, దీనిని భగ్నంచేసే వరకు డీఎంకే విశ్రమించబోదన్నారు.
తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే, జమిలీ ఎన్నికలకు మద్దతు ఇవ్వడం శోచనీయమన్నారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో ఈ ఎన్నికలను వ్యతిరేకించిన అన్నాడీఎంకే, ఇప్పుడు మద్దతు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుగా కేంద్రాన్ని అన్నాడీఎంకే నమ్ముకుంటోందని, తొలి బలి పశువు అన్నాడీఎంకే కావడం తథ్యమని అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల కారణంగా డీఎంకే మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాలలోని ప్రాంతీయ పార్టీలన్నీ మనుగడ సాధించడ కష్టతరం అన్నారు. దేశంలో ఏకాధిపతి పాలన వైపుగా ప్రధాని నరేంద్రమోదీ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకునేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని గుర్తు చేస్తూ, తాము అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అవుతోందన్నారు.
మరో రెండున్నరేళ్లు తమకు అవకాశం ఉందని, అలాంటప్పుడు ఈ పాలనను రద్దు చేస్తారా..? కర్ణాటకలో పరిస్థితులు బీజేపీకి పునరావృతం కాబోతోందని హెచ్చరించారు. ఒకేసారి ఎన్నికలు నిర్వహించిన పక్షంలో, రాష్ట్రాలలో ప్రభుత్వ ఏర్పాటుకు మెజారిటీ తగ్గితే, ఆ రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధిస్తారా..? అని ప్రశ్నించారు. అందుకే నీచాతినీచమైన ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ రోజు నుంచే భారతదేశాన్ని రక్షించ కోవడం లక్ష్యంగా, అందరూ సిద్ధం అయ్యే విధంగా ప్రతిజ్ఞ చేయాలని స్టాలిన్ పిలుపు నిచ్చారు.
జమిలీ ఎన్నికల కారణంగా దేశంలో తొలి బలి పశువు అయ్యే పార్టీ అన్నాడీఎంకే అని సీఎం ఎంకే స్టాలిన్ వ్యాఖ్యానించారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు రాష్ట్రంలోని ఈ పార్టీ కేంద్రంలోని బీజేపీని నమ్ముకోవడం శోచనీయమని విమర్శించారు. ఒకే దేశం..ఒకే ఎన్నికలతో దేశంలో నియంతృత్వానికి ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జమిలీని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.
ప్రభుత్వాన్ని రద్దు చేస్తారా?
దేశాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ప్రస్తుతం ప్రతి పౌరుడి మీద ఉందన్నారు. ఎవరు ప్రధాని అవ్వాలో..? అన్న విషయాన్ని పక్కన పెడితే, ఎవరు ప్రధాని కాకూడదో అన్నది ముఖ్యం అని అభిప్రాయపడ్డారు. ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలనే ప్రయత్నాలలో బీజేపీ తీవ్ర కుట్రలు చేస్తోందని, వ్యూహాలకు పదును పెడుతోందని వివరించారు. వీటిని అడ్డుకునేందుకే ఇండియా కూటమి ఏర్పడిందని, ఈ కూట మిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీలో వణుకు మొదలైందని ఎద్దేవా చేశారు. ఈ కూటమి నేతృత్వంలో క్షేత్రస్థాయిలో కార్యక్రమా లు విస్తృతం కాబోతున్నాయన్నారు. ఇండియా కూటమికి వస్తున్న ఆదరణను చూసి భయంతో కొత్త కుట్రలపై కేంద్రం దృష్టి పెట్టిందని ధ్వజ మెత్తారు. ఒకే దేశం..ఒకే ఎన్నిక పేరుతో రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వాన్ని అర్ధాంతరంగా రద్దు చేస్తారా? అదీచూద్దాం.. అంటూ సవాల్ విసిరారు.