కోర్టులో మరో పిటిషన్‌ | - | Sakshi
Sakshi News home page

కోర్టులో మరో పిటిషన్‌

Jul 2 2023 7:34 AM | Updated on Jul 2 2023 7:31 AM

- - Sakshi

సాక్షి, చైన్నె: మంత్రి సెంథిల్‌ బాలాజి వ్యవహారంలో కోర్టులో మరో పిటిషన్‌ దాఖలైంది. డిస్మిస్‌ ఉత్తర్వులను గవర్నర్‌ వెనక్కి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం ఈ పిటిషన్‌ను న్యాయవాది ఎంఎల్‌ రవి దాఖలు చేశారు. క్యాష్‌ ఫర్‌ జాబ్స్‌ వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసులో అరెస్టయిన మంత్రి సెంథిల్‌ బాలాజీకి వ్యతిరేకంగా, అనుకూలంగా కోర్టుల్లో అనేక పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే.

ఇందులో కీలక కేసు విచారణ ముగిసింది. తీర్పు వెలువడాల్సి ఉంది. ఈ సమయంలో ఇలాకా లేని మంత్రిగా సెంథిల్‌ కొనసాగడాన్ని గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి పరిగణించి డిస్మిస్‌ చేశారు. ఈ ఉత్తర్వులను రాత్రికి రాత్రే వెనక్కి తీసుకున్నారు. ఈ వ్యవహారాన్ని కూడా అస్త్రంగా చేసుకుని కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. రాజకీయ శాసనాల మేరకు జరిగిన వ్యవహారంలో గవర్నర్‌ హఠాత్తుగా తన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవడంపై సమగ్ర విచారణ జరపాలని, డిస్మిస్‌ ఉత్తర్వులు కొనసాగే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ ఈ పిటిషన్‌ దాఖలైంది.

సోమవారం ఈ పిటిషన్‌ విచారణకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో డిస్మిస్‌ ఉత్తర్వుల విషయంగా కేంద్ర సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాతో మరో మారు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి చర్చించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ఆదివారం స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయని, సెంథిల్‌ను డిస్మిస్‌ చేయడం ఖాయం అనే చర్చ జోరందుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement