భానుపురి (సూర్యాపేట) : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అధికారులను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజల నుంచి 95 అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా, మండల స్థాయి ప్రజావాణి దరఖాస్తులను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. పాత ప్రజావాణి పోర్టల్లో ఇంకా పరిష్కారం కాకుండా ఉన్న దరఖాస్తులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. మండల స్థాయిలో ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంపై కూడా కలెక్టర్ సమీక్షించారు. మండల స్థాయి ప్రజావాణికి అన్ని శాఖల మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరయ్యేలా జిల్లా అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి.హరిసింగ్, డీఆర్ఓ ప్రేమ్రాజ్, జిల్లా పరిషత్ సీఈఓ శిరీష, డీఆర్డీఓ సన్యాసయ్య, డీఈఓ అశోక్, డీపీఓ యాదగిరి, డీఏఓ శ్రీధర్రెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


