ఆదేశాలు రాగానే అమలు చేస్తాం..
హుజూర్నగర్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందని ద్రాక్షాగా మారింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ నేటికీ కార్యరూపం దాల్చడం లేదు. దీంతో విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల్లోని కళాశాలలకు వచ్చి అర్ధాకలితో తరగతి గదుల్లో కూర్చుని సాయంత్రం వరకు పాఠాలు వినాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.
జిల్లాలో 8 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు
జిల్లాలో సూర్యాపేట, నడిగూడెం, తుంగతుర్తి, కోదాడ, నేరేడుచర్ల, హుజూర్నగర్, నెమ్మికల్, తిరుమలగిరితో కలిపి మొత్తం ఎనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వాటిలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం కలిపి 2,969 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో ఫస్టియర్కు చెందిన విద్యార్థులు 1,575 మంది, సెకండియర్ విద్యార్థులు 1,394 మంది ఉన్నారు.
దెబ్బతింటున్న ఏకాగ్రత
ప్రతిరోజూ విద్యార్థులు ఉదయాన్నే బస్సులు, ఆటోలు ఇతర వాహనాలలో వెళ్లాలనే తొందరలో చాలా మంది ఇంటి వద్ద అల్పాహారం కూడా తినకుండానే కళాశాలలకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో వారు మధ్యాహ్నం భోజనం లేక ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో అధ్యాపకులు బోధించే పాఠాలపై ఏకాగ్రత పెట్టలేని పరిస్థితి.
రెండు నెలలైనా పథకం ఊసేలేదు!
ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు రెండు నెలలు దాటినా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు కాదుకదా కనీసం అల్పాహారం కూడా విద్యార్థులు అందడం లేదు. జానియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో గ్రామీణులే అధికంగా ఉన్నారు. విద్యార్థులు ప్రతిరోజూ ఉదయం ఇళ్ల నుంచి ఉదయమే బయలుదేరి 15 నుంచి 25 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కళాశాలలకు చేరుకోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటి వద్ద ఏమీ తినకుండా వచ్చిన విద్యార్ధుల పరిస్ధితి అగమ్యగోచరంగా తయారైంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని, ఉదయం అల్పాహారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రకటించినా అమలుకాని మధ్యాహ్న భోజన పథకం
కనీసం అల్పాహారమూ
అందించని ప్రభుత్వం
జిల్లావ్యాప్తంగా 2,969 మంది
విద్యార్థుల నిరీక్షణ
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పేద, మధ్యతరగతి పిల్లలు ఎక్కువగా చదువుతున్నారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెరిగాయి. విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం అమలుపై ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే వెంటనే అమలు చేస్తాం.
– బి.సులోచన రాణి, డీఐఈఓ


