మఠంపల్లి : మట్టపల్లి క్షేత్రంలో మంగళవారం శ్రీలక్ష్మీనరసింహస్వామి నిత్య కల్యాణాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో మూలవిరాట్ స్వామికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు అర్చన, నిత్య హోమం జరిపారు. అదేవిధంగా క్షేత్రపాలకుడైన శ్రీవీరాంజనేయ స్వామికి నాగవల్లి దళాలతో ప్రత్యేక అర్చనలు చేసి భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లి రావు, విజయకుమార్, ఈవో చలపతిరావు, అర్చకులు కృష్ణమా చార్యులు, పద్మనాభచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయ చార్యులు, భక్తులు పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులతో
అప్రమత్తంగా ఉండాలి
అర్వపల్లి : సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి డాక్టర్ ప్రసిద్ధ్ కోరారు. అర్వపల్లిలోని పీహెచ్సీలో మంగళవారం జరిగిన ఆశా డే సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి జ్వర బాధితులను గుర్తించి సకాలంలో వైద్య సేవలందించాలన్నారు. ప్రతి వారంలో రెండు రోజులు డ్రై డేగా పాటించాలని సూచించారు. సమావేశంలో వైద్యాధికారి డాక్టర్ బి.నగేష్నాయక్, సీహెచ్ఓ ఎం.బిచ్చునాయక్, డీపీఎంఓ సురేష్కుమార్, సూపర్వైజర్ లలిత, సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
పంట మార్పిడితోనే
అధిక దిగుబడి
గరిడేపల్లి : రైతులు పంట మార్పిడి విధానాన్ని పాటించి దిగుబడులు సాధించాలని గడ్డిపల్లి కేవీకే శాస్త్రవేత్త డి.ఆదర్శ్ అన్నారు. గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా మధ్యప్రదేశ్కు చెందిన ఐటీఎం యూనివర్సిటీ అగ్రికల్చర్ బీఎస్సీ విద్యార్థులు మంగళవారం గరిడేపల్లి మండలం గడ్డిపల్లి సొసైటీలో నిర్వహించిన గ్రామీణ వ్యవసాయ విధానాలు స్థితిగతులపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు ఒకే పంట పండిస్తుండడంతో భూసారం తగ్గి దిగుబడులు కూడా తగ్గుతున్నాయన్నారు. కార్యక్రమంలో గడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మాశెట్టి శ్రీహరి నాగలక్ష్మి, ఉప్ప సర్పంచ్ షేక్ గులాం, కేవీకే శాస్త్రవేత్తలు పి.అక్షిత్ సాయి, ఏ కిరణ్, ఛిజి నరేష్, ఎన్ సుగంధి, ప్రోగ్రామ్ అసిస్టెంట్ కంప్యూటర్ ఏ.నరేష్, రైతులు, అరబిందో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.
కాల్వ ఆక్రమణల గుర్తింపునకు ‘డ్రోన్’ చిత్రీకరణ
నేరేడుచర్ల : నాగార్జునసాగర్ ఎడమ కాల్వ పరిధిలోని నేరేడుచర్ల మీదుగా వెళ్తుతున్న ఆర్–3 మేజర్ కాల్వ ఆక్రమణలపై ఎన్ఎస్పీ అధికారులు మంగళవారం డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరించారు. ముందుగా కాల్వకు మార్కింగ్ చేసి డ్రోన్ కెమెరాతో ఫొటోలు తీసి వీడియో చిత్రీకరించారు. ఇప్పటికే గుగూల్ మ్యాప్ ద్వారా ఆక్రమణలను గుర్తించిన అధికారులు మరోసారి పూర్తి స్థాయి నివేదికను అందించేందుకు డ్రోన్ ద్వారా కెమెరా సహాయంతో వివరాలను సేకరించారు. ఆక్రమణలను పూర్తి స్థాయిలో తొలగించి లైనింగ్ పనులు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఆక్రమణదారులు స్వచ్ఛందంగా తొలగించుకోకుంటే పోలీసు, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకుని తొలగించనున్నట్లు ఎన్ఎస్పీ అధికారులు తెలిపారు.


