సూర్యాపేటటౌన్ : ప్రభుత్వ ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా జిల్లాలో స్టాఫ్ నర్సు నియామక ప్రక్రియ ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. జిల్లాలోని బస్తీ దవాఖానాల్లో కాంట్రాక్టు విధానంలో భర్తీ చేయనున్న నాలుగు స్టాఫ్ నర్సు పోస్టులకు ఏకంగా 635 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారంటే పరిస్థితికి అద్దంపడుతోంది. ఒక పోస్టుకు సగటున 159 మంది పోటీ పడుతుండడం గమనార్హం.
ఇతర జిల్లాల అభ్యర్థులు కూడా..
కాంట్రాక్టు పద్ధతిలో నాలుగు స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి జిల్లా వైద్యారోగ్య శాఖ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అర్హత కలిగిన అభ్యర్థులు భారీగా స్పందించారు. సూర్యాపేటతోపాటు నల్ల గొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలకు చెందిన అభ్యర్థులు కూడా దరఖాస్తులు సమర్పించినట్లు సమాచారం. ఉద్యోగ అవకాశాలు తగ్గడం, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు పరిమితంగా ఉండటంతో చిన్న పోస్టులకే తీవ్ర పోటీ నెలకొంది. కాగా స్టాఫ్ నర్సు ఉద్యోగ నియామకాల ప్రక్రియకు జూలై 31న దరఖాస్తుల గడువు ముగిసింది.
కేటగిరీల వారీగా దరఖాస్తుల పరిశీలన
ప్రస్తుతం అందిన దరఖాస్తులను అధికారులు కేటగిరీల వారీగా పరిశీలిస్తున్నారు. విద్యార్హతలు, సర్టిఫికెట్లు, రిజర్వేషన్ నిబంధనలకు అనుగుణంగా వర్గీకరణ చేపడుతున్నారు. ఇందులో ఎలాంటి పొరపాట్లు లేకుండా ప్రత్యేకంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఫలితాలపై ఉత్కంఠ
భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కేవలం నాలుగు పోస్టులే ఉండటంతో మెరిట్లో స్వల్ప తేడా కూడా ఎంపికపై ప్రభావం చూపే అవకాశం ఉందని అభ్యర్థులు భావిస్తున్నారు. అయితే ఈ పక్రియ మరో పది నుంచి పదిహేను రోజులు పట్టనున్నట్టు వైద్యారోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఫలితాల కోసం దరఖాస్తుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మెరిట్, రోస్టర్ విధానం
ఆధారంగానే ఎంపిక
దరఖాస్తుల పరిశీలన పూర్తయిన అనంతరం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పడే కమిటీ మెరిట్, రోస్టర్ విధానాన్ని అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అర్హత, విద్యార్హతల్లో వచ్చిన మార్కులు, ప్రభుత్వ నిబంధనలను పరిగణనలోకి తీసుకుని తుది జాబితా ప్రకటించనున్నారు.
కాంట్రాక్టు స్టాఫ్ నర్సు
ఉద్యోగాలకు యమ డిమాండ్
ఇటీవల నోటిఫికేషన్..
ముగిసిన దరఖాస్తు గడువు
ఒక్కో పోస్టుకు 159 మంది పోటీ
అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ


