ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. ఐదు చోట్ల 50 వేలకుపైగా మెజారిటీ.. | - | Sakshi
Sakshi News home page

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో.. ఐదు చోట్ల 50 వేలకుపైగా మెజారిటీ..

Dec 4 2023 2:58 AM | Updated on Dec 4 2023 7:50 PM

- - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు అత్యధిక మెజారిటీ సాధించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు గాను 11 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. వారిలో ఐదుగురు 50 వేలకు పైగా మెజారిటీ సాధించారు. మరో నలుగురు 40 వేలకు పైగా మెజారిటీ సాధించారు. ఇద్దరు 20 వేలకు పైగానే మెజారిటీ సాధించారు. సూర్యాపేటలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి, మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డికి ఉమ్మడి జిల్లాలోనే అత్యల్పంగా 4,606 ఓట్ల మెజారిటీ లభించింది.

ఉమ్మడి జిల్లాలో సరికొత్త రికార్డు!
నకిరేకల్‌నుంచి గెలుపొందిన వేముల వీరేశం 68,839 ఓట్ల మెజారిటీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై విజయం సాధించారు. 1952 నుంచి జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు ఎవరూ ఇంత మెజారిటీ సాధించలేదు. తొలిసారిగా వేముల వీరేశం 68,839 ఓట్ల మెజారిటీ సాధించి రికార్డు నెలకొల్పారు.

50 వేలకుపైగా మెజారిటీ..
కోదాడలో నలమాద పద్మావతిరెడ్డి 58,172 ఓట్ల మెజారిటీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్‌పై గెలుపొందారు. నాగార్జునసాగర్‌లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి కుందూరు జయవీర్‌రెడ్డి 55,849 ఓట్ల మెజారిటీ సాధించారు. నల్లగొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 54,332 ఓట్ల మెజారిటీతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కంచర్ల భూపాల్‌రెడ్డిపై విజయం సాధించారు.

తుంగతుర్తిలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి గాదరి కిషోర్‌కుమార్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి మందుల సామేల్‌ 51,094 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇక ఆలేరులో బీర్ల ఐలయ్య 49,636, మిర్యాలగూడలో బత్తుల లక్ష్మారెడ్డి 48,782, హుజూర్‌నగర్‌లో నలమాద ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి 44,888, మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 40,590, దేవరకొండలో నేనావత్‌ బాలునాయక్‌ 30,021, భువనగిరిలో కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి 26,201 ఓట్ల మెజారిటీ సాధించారు.
ఇవి చ‌ద‌వండి: 24 ఏళ్లుగా కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కల.. నెరవేర్చిన తనయుడు!

Advertisement
 
Advertisement
Advertisement