తాళం వేసిన ఇళ్లలో చోరీ
పెద్దఅడిశర్లపల్లి : మండల కేంద్రంలో తాళం వేసి ఉన్న నాలుగు ఇళ్లల్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దఅడిశర్లపల్లికి చెందిన జానపాటి లక్ష్మమ్మ సోమవారం తన ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లింది. బుధవారం ఆమె ఇంటికి తాళం లేకపోవడంతో ఇంటిపక్క వారు గమనించి లక్ష్మమ్మకు సమాచారం అందించారు. లక్ష్మమ్మ ఇంటికి వచ్చి తలుపులు తీసేసరికి ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. ఇంట్లోని బీరువాలో ఉంచిన తులం బంగారం, 40 తులాల వెండి ఆభరణాలు, రూ.20 వేల నగదు దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆధారాలు సేకరించారు. మండల కేంద్రానికి చెందిన ఓ రైతు ఇంట్లో కూడా దొంగలు చొరబడి వెండి సామగ్రి మెత్తుకెళ్లారు. తాళం వేసి ఉన్న మరో రెండు ఇళ్లలో కూడా దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆయా ఇళ్ల వారు వచ్చి చూస్తేగానీ ఏమేమి చోరీకి గురయ్యాయనే విషయం తెలుస్తుంది.


