పాతపట్నం: హిరమండలం, కొత్తూరు మండలాల్లో ఉన్న వంశధార నది నుంచి పాతపట్నం మీదుగా ఒడిశాకు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగిపోతోంది. హిరమండలం మండలంలోని భగీరథపురం, కొత్తూరు మండలంలోని నివగాం, పొట్నూరు నదీతీరం నుంచి ప్రతిరోజూ ఇసుకను ఒడిశాకు తరలిస్తున్నారు. నదిలో ఇసుక తవ్వకాలకు అనుమతి లేకపోయినప్పటకీ దర్జాగా తమ దందా సాగిస్తున్నారు. పాతపట్నంలోని సరిహద్దు ప్రాంతాలు అంతరాబ, అచ్చుతాపురం, ఆర్.ఎల్.పురం చీకటి తోట సమీపంలో ఇసుక పోగులు వేసి, అనంతరం ఒడిశాకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అందువలన ఇప్పటికై నా ఇసుక అక్రమ రవాణాను రెవెన్యూ, మైనింగ్, పోలీసు అధికారులు అడ్డుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


