హిరమండలం: రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణానికి కారణమైన పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో పాటు ఆయన కుమారుడు సాయిగణేష్పై తక్షణం కేసు నమోదు చేయాలని పాతపట్నం మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఏడాదిన్నర కిందట పాతపట్నం మండలం కొరసవాడ సమీపంలో ఓ రోడ్డు ప్రమాదానికి ఎమ్మెల్యే గోవిందరావు కుమారుడు సాయిగణేష్ కారణమని ఆరోపించారు. నాడు బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే హోదాలో గోవిందరావు బెదిరించిన వైనం బయటపడిన విషయాన్ని ప్రస్తావించారు. మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి మర్చిపోయారని మండిపడ్డారు. తక్షణం పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావుతో పాటు ఆయన కుమారుడుపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కిడ్నాప్కు యత్నంపై ఫిర్యాదు
టెక్కలి రూరల్: మండలంలో లింగాలవలస గ్రామంలోని పీహెచ్సీకి సమీప వెల్నెస్ సెంటర్లో కాంట్రాక్ట్ బేసిక్లో పనిచేస్తున్న ఒక మహిళతో, గార మండలం బందరవానిపేటకు చెందిన వారాది రాంబాబు అనే వ్యక్తి మంగళవారం ఆమె పనిచేస్తున్న స్థలానికి వచ్చి గొడవకు దిగాడు. అనంతరం ఆమెను బలవంతంగా తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.


