ధర్మవరం అర్బన్: అందరి విద్యార్థుల్లా చదువు మాత్రమే చాలు అనుకోలేదు. క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావం, నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలనుకున్నారు. వారి ఆశయాలకు ఎన్సీసీ తోడైంది. ధర్మవరం పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గత ఏడాది నుంచి ఎన్సీసీ అమలు చేస్తున్నారు. ఎన్సీసీలో చేరాలనే ఉత్సాహం, దేశం కోసం పనిచేయాలన్న తపన ఉన్న 50 మంది విద్యార్థులు ఎన్సీసీ కేడెట్లుగా చేరారు. వారందరికి వారానికి ఒకసారి అనంతపురం బెటాలియన్ నుంచి ఎన్సీసీ ఆఫీసర్ ఒకరు వచ్చి పాఠశాల క్రీడా మైదానంలో ప్రత్యేక శిక్షణనిస్తున్నారు. పాఠశాల పీడీ నాగేంద్ర కేర్ టేకర్గా వ్యవహరిస్తూ వసతులు సమకూరుస్తున్నారు. విద్యార్థులకు ఎన్సీసీలో కఠోర సాధన చేయిస్తూ వారి భవితకు నిచ్చెన వేయిస్తున్నారు. చదువు పూర్తయ్యాక పోలీస్, ఆర్మీలలో చేరితే అక్కడ శిక్షణలో సులువుగా ఉండేందుకు ఎన్సీసీలోనే కఠిన శిక్షణ పొందుతున్నారు. ఒకవైపు ఎన్సీసీ శిక్షణ, మరోవైపు పాఠశాలలో చదువుకునేందుకు ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు ఎన్సీసీ శిక్షణలో రాటు తేలుతున్నారు. పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహిస్తూ సమాజ ఉన్నతి కోసం పాటుపడుతున్నారు.
ఎన్సీసీలో రాటు దేలుతున్న విద్యార్థులు
క్రమశిక్షణ, దేశభక్తి, సేవాభావాన్ని
నూరిపోస్తున్న శిక్షకులు
దేశ సేవకు అంకితమవుతామంటున్న కేడెట్లు


