● ముగ్గురి అరెస్టు
ఆత్మకూరు: మండలంలోని పంపనూరు వద్ద జరిగిన దారి దోపిడీకి సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ హేమంత్కుమార్ తెలిపారు. సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ లక్ష్మణరావుతో కలసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆత్మకూరు మండలం సిద్దరాంపురం గ్రామానికి చెందిన భాను ప్రకాష్, రామ్చరణ్, బత్తలపల్లి మండలం పొట్లమర్రి గ్రామానికి చెందిన మహేష్కుమార్ చెడు అలవాట్లకు బానిసలయ్యారు. దారి దోపిడీలు చేయడం ప్రారంభించారు. ఈ నెల 16న తెల్లవారుజామున 2 గంటల సమయంలో కళ్యాణదుర్గం మండలం మానిరేవు గ్రామానికి చెందిన ఓబుళపతి బొలెరోలో వెళ్తుండగా అతనిపై దాడి చేసి వాహనాన్ని ఎత్తుకెళ్లారు. అనంతపురానికి చెందిన ప్రసన్నకుమార్ కొరియర్ సర్వీస్ వాహనంలో వెళ్తుండగా వాహనం ఆపి అతని వద్ద ఉన్న రూ.20 వేలు దొంగిలించారు. అనంతరం దొంగిలించిన బొలెరోలో వై.కొత్తపల్లికి వెళ్లి గ్రామానికి చెందిన బోయ రామకృష్ణ తోటలో గొర్రెల దొంగతనానికి విఫలయత్నం చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎస్పీ జగదీష్ సూచనల మేరకు నాలుగు బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. సోమవారం ముగ్గురినీ వై. కొత్తపల్లి వద్ద అదుపులోకి తీసుకున్నారు. పంపనూరు గ్రామానికి చెందిన రంజిత్ పరారీలో ఉన్నట్లు సీఐ హేమంత్కుమార్ తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎస్ఐ గౌస్, దస్తగిరి, కానిస్టేబుల్స్, పవన్, చౌడప్ప, మహేష్, అశోక్, హర్ష తదితరులు పాల్గొన్నారు.


