పుట్టపర్తి అర్బన్: మహిళను వేధిస్తున్న ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. కొత్తచెరువు అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సీఐ రాజశేఖర్ తెలిపిన మేరకు.. కొత్తచెరువు మండలం కేశాపురం గ్రామానికి చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన హరినాథ్రెడ్డి కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. మహిళ వెంట పడుతూ అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. సోమవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు.
చట్ట పరిధిలో
పరిష్కారం చూపాలి
పుట్టపర్తి అర్బన్: ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యకూ చట్ట పరిధిలోనే పరిష్కారం చూపాలని ఎస్పీ సతీష్కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు సత్వర న్యాయం అందించడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమన్నారు. ప్రతి సమస్యనూ క్షుణ్ణంగా పరిశీలించి న్యాయం చేయాలన్నారు. ప్రజల నుంచి 70 అర్జీలను స్వీకరించిన ఆయన వాటిని ఆయా స్టేషన్లకు పంపి పరిష్కరించాలని ఆదేశించారు. గడువులోపు ప్రతి సమస్యనూ చట్ట పరిధిలోనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అంకితా సురానా, సీఐలు లక్ష్మీకాంత్రెడ్డి, బొజ్జప్ప, లీగల్ ఆడ్వైజర్ సాయినాథరెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
బాలుడి అదృశ్యం కథ సుఖాంతం
కదిరి టౌన్: పట్టణంలోని వలీసాబ్ రోడ్డుకు చెందిన ఖాదిర్, అల్పియా దంపతుల నాలుగేళ్ల కుమారుడు హారన్ సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సీఐ బి.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో బ్లూకోర్టు సిబ్బంది రమేష్, రఫిలు బాలుడి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. పట్టణంలోని ఓ పండ్ల వ్యాపారి బండి వద్ద బాలుడు ఉన్నట్లు సమాచారం రావడంతో, వెంటనే అక్కడకు చేరుకుని అదుపులోకి తీసుకున్నారు. తల్లిదండ్రులకు బాలుడిని అప్పగించారు. సీఐ బి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.


