అనంతపురం: జర్మనీకి చెందిన నాలెడ్జ్ ఫౌండేషన్ రాయిట్లింగెన్ యూనివర్సిటీ, జేఎన్టీయూ(ఏ) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక ఐదేళ్ల ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ బాచిలర్స్– మాస్టర్స్ ప్రోగామ్ (ఐఐబీఎంపీ – బీటెక్ కోర్సు)లో మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నారు. ఈ మేరకు జేఎన్టీయూ(ఏ) వీసీ సుదర్శన్రావు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అంతర్జాతీయ విద్యా కార్యక్రమం కింద విద్యార్థులు దేశీయంగా బీటెక్ పూర్తి చేసి, అనంతరం జర్మనీలో మాస్టర్స్ విద్యను పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ ఇన్ ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, బీటెక్ ఇన్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ ఎంఎస్సీ ఇన్ డిజిటల్ బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. జేఈఈ, ఏపీఈఏపీ, టీజీఈఏపీ సెట్ ద్వారా పొందిన ర్యాంకులు, ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ సబ్జెక్టుల మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ నెల 10న ఉదయం 10 గంటలకు జేఎన్టీయూలోని అడ్మిషన్స్ విభాగంలో జరిగే కౌన్సెలింగ్ ప్రక్రియకు ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. పూర్తి వివరాలకు 77027 68080, 78914 88999, 78915 88999లో సంప్రదించాలని కోరారు.
పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన దుండగులు
హిందూపురం: పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన దుండగులు అనంతరం ఆపకుండా వెళ్లిపోయిన ఘటన పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. వివరాలు.. శుక్రవారం అర్ధరాత్రి హిందూపురంలోని చిన్నమార్కెట్ వద్ద సీఐ జనార్దన్ సిబ్బందితో కలిసి వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే బెంగళూరు రోడ్డు వైపు ఓ బొలెరో వాహనం వేగంగా వెళ్లిపోయింది. సీఐ జనార్దన్ ఈ విషయంపై టౌన్ సీఐ అబ్దుల్ కరీంకు సమాచామివ్వగా.. వెంటనే ఆయన సిబ్బందితో కలిసి మార్గమధ్యంలోని ఆటోనగర్కు చేరుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు పోలీసు వాహనాన్ని అడ్డుగా ఉంచారు. అయితే, దుండగులు నిలపకుండా సీఐ వాహనాన్ని కూడా ఢీకొట్టి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న ఎస్పీ సతీష్కుమార్ శనివారం సాయంత్రం హిందూపురం వచ్చి పోలీసు అధికారులతో చర్చించారు. వాహనాన్ని పట్టుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని ఏఎస్పీ మహేష్తోపాటు సీఐలను ఆదేశించినట్లు తెలిసింది.
దంపతుల నడుమ రాజీ కోసమే
ఫ్యామిలీ కౌన్సెలింగ్
ధర్మవరం అర్బన్: భార్యాభర్తల నడుమ రాజీ చేసి వారిని తిరిగి ఒక్కటి చేయడమే పోలీస్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ లక్ష్యమని ఎస్పీ సతీష్కుమార్ తెలిపారు. పట్టణంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో శనివారం ‘పోలీస్ ఫ్యామిలీ కౌన్సెలింగ్’ సెంటర్ను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నపాటి గొడవలకే విడిపోతున్న భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి వారు సజావుగా జీవించేలా కౌన్సెలింగ్ తోడ్పడుతోందన్నారు. కౌన్సెలింగ్ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ జగన్నాథ్రాజు, వన్ టౌన్ సీఐ రెడ్డెప్ప, కౌన్సెలింగ్ సభ్యులు చలపతి, బాలసుందరి, గంగాభవాని, రాఘవ తదితరులు పాల్గొన్నారు.
‘ఉపాధ్యాయుడి మట్టి లీలలు’పై
విద్యాశాఖ సీరియస్
చిలమత్తూరు: ఉపాధ్యాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న విషయంపై విద్యాశాఖ సీరియస్ అయింది. ‘ఉపాధ్యాయుడి మట్టి లీలలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై స్పందించిన అధికారులు ఆయనపై విచారణకు ఆదేశించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే సదరు ఉపాధ్యాయుడు మాదిరెడ్డిపల్లి వద్ద రోడ్డు పక్కన పభుత్వ భూమిని కబ్జా చేశాడనే విషయాన్ని మండల విద్యాశాఖ అధికారులు గుర్తించారు. గతంలోనూ భూముల క్రయ విక్రయాల్లో రైతులకు డబ్బు చెల్లించకుండా సదరు టీచర్ మోసాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. గుడిబండ మండలంలో పనిచేసే ఈ ఉపాధ్యాయుడు చిలమత్తూరు మండల సరిహద్దులో గల బాగేపల్లిలో నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తోంది.
‘సాక్షి’ విలేకరికి బెదిరింపులు..
తన లీలలపై ‘సాక్షి’లో కథనం వెలువడడంతో సదరు ఉపాధ్యాయుడు ఉలిక్కిపడ్డారు. ఈ క్రమంలోనే తన అనుచరుడు అశ్వర్థప్ప ద్వారా ‘సాక్షి’ విలేకరిపై ఫోన్లో బెదిరింపులకు పాల్పడ్డాడు. ‘మీ కథ చూస్తాడంట’ అంటూ బెదిరించడం గమనార్హం.


