పెనుకొండ రూరల్: పర్యవరణాన్ని పరిరక్షిస్తూ భూగర్భజలాను పెంపొందించడాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ సూచించారు. బుధవారం ఆయన మంత్రి సవితతో కలిసి పెనుకొండ 44వ జాతీయ రహదారి పక్కన ఉన్న అటవీ ప్రాంతంలో ‘సీడ్ బాల్స్’ వెదజల్లే కార్యక్రమంలో పాల్గొన్నారు. డ్రోన్ల సాయంతో ‘సీడ్ బాల్స్’ను అటవీ ప్రాంతంలో చల్లారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... జిల్లాలో పచ్చదనం పెంపొందించేందుకు అటవీ ప్రాంతంలో వెదజల్లేందుకు 13 లక్షల సీడ్ బాల్స్ సిద్ధం చేశామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. యువత సోషల్ మీడియాను పక్కనపెట్టి ప్రకృతికి దగ్గర కావాలని హితవు పలికారు. ప్రతి శుభ కార్యానికి ఒక మొక్కను నాటడం ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్ కుమార్, డీఎఫ్ఓ చక్రపాణి, ఎఫ్ఆర్ఓ శ్రీనివాసరెడ్డి, డీఆర్ఓ షఫీ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
విధుల్లో అలసత్వాన్ని సహించం..
అంతకుముందు స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించారు. సిబ్బంది హాజరు, పెండింగ్ ఫైళ్లు, మీ–సేవా దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల నుంచి అందే ఫిర్యాదులు, వినతులు ఎప్పటికప్పుడు పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. రీ సర్వే, భూ రికార్డుల ప్రక్షాళన, ఇతర రెవెన్యూ సేవల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ ఆనంద్ కుమార్, తహసీల్దార్ స్వాతి, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.
కలెక్టర్ శ్యాంప్రసాద్
నేడు పుట్టపర్తిలో
‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ
ప్రశాంతి నిలయం: జిల్లా కేంద్రం పుట్టపర్తిలో గురువారం ‘హర్ ఘర్ తిరంగా’ ర్యాలీ నిర్వహించనున్నట్లు కలెక్టర్ శ్యాం ప్రసాద్ తెలిపారు. ర్యాలీలో ప్రజా ప్రతినిధులు, యువత, అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 9.30 గంటలకు పుట్టపర్తిలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ వరకు కొనసాగుతుందన్నారు. జాతీయ ఐక్యత, దేశభక్తిని చాటిచెప్పే లక్ష్యంతో ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.


