రొద్దం: పెన్నానది పరివాహక ప్రాంతంలో ఇసుక దందా ఆగడం లేదు. మండలంలోని పెద్దమంతూరు, రొద్దం, చిన్నమంతూరు పరివాహక ప్రాంతం నుంచి ఇసుక అక్రమ రవాణా పెద్ద ఎత్తున సాగుతోంది. అనుమతులు లేకుండా వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. అభివృద్ధి పనుల పేరుతో అధికారులను బురిడీ కొట్టిస్తూ యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. పెన్నానదిలో ఎక్కడ చూసినా పెద్ద పెద్ద గోతులే దర్శనమిస్తున్నాయి. పెద్దమంతూరు రొప్పాల, పి.కొత్తపల్లి, పెద్దకోడిపల్లి, సుబ్బరాయప్ప కొట్టాల గ్రామాలకు చెందిన అక్రమార్కులు ఇసుక దందా చేస్తూ జేబులు నింపుకుంటున్నారని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. పెన్నానదిలో బోర్ల ద్వారా వందలాది ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని రైతులు తెలియజేస్తున్నారు. నదిలో ఇసుక తోడేస్తే భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయే పరిస్థితి నెలకొంటోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుటి నుంచి ప్రకృతి వనరులను దోచేస్తున్నారని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించకపోతే రైతు కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తుందని, తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రోజూ వందల ట్రాక్టర్లలో
అక్రమ రవాణా
భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతుల ఆవేదన


