కట్టుకున్నోడే కాలయముడు! | - | Sakshi
Sakshi News home page

కట్టుకున్నోడే కాలయముడు!

Aug 13 2026 1:09 AM | Updated on Aug 13 2026 1:09 AM

అనంతపురం సెంట్రల్‌: ఓ మ్యాట్రిమోనీ ద్వారా వారిద్దరి మనసులు కలిశాయి. కొన్ని రోజులకే వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. ఏమైందో తెలియదు కానీ పైళ్లెన నెలరోజులకే భర్త కాలయముడిగా మారి భార్యను కడతేర్చాడు. పోలీసుల కథనం మేరకు... కొత్తచెరువు మండలం పోతుకుంట గ్రామానికి చెందిన మహేష్‌, గుంటూరుకు చెందిన శాంతి (26)కి మధ్య ఓ మ్యాట్రిమొనీ వెబ్‌సైట్‌ ద్వారా పరిచయం కుదిరి మనసులు కలిశాయి. నెలరోజుల క్రితం ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. పైళ్లెన తర్వాత మహేష్‌, శాంతి అనంతపురం నగరంలోని యల్లమ్మ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కాపురం పెట్టారు. శాంతి ఇంట్లోనే ఉంటుండగా, మహేష్‌ ఆటో తీసుకొని పాల ప్యాకెట్ల వ్యాపారం చేసేవాడు. ఏమైందో తెలియదు కానీ, మూడు రోజుల క్రితం రోకలి బండతో మోది శాంతిని మహేష్‌ దారుణంగా హత్య చేశాడు. గుట్టు చప్పుడు కాకుండా ఇంటికి తాళం వేసి ఎక్కడికో పరారయ్యాడు. కొత్తగా పెళ్లయిన వారు కావడంతో భార్యాభర్తలిద్దరూ బంధువుల ఊళ్లకు వెళ్లారేమోనని ఇంటి యజమానులు భావించారు. బుధవారం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా శాంతి రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గుంటూరులో నివాసముంటున్న మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని డీఎస్పీ చంద్రశేఖర్‌ పరిశీలించారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు వెల్లడించారు.

పెళ్లయిన నెలకే రోకలిబండతో మోది భార్యను కడతేర్చిన భర్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement