● అర్జీదారుడితో మంతనాలు
● సోషల్ మీడియాలో వైరల్
పొదలకూరు: నెల్లూరు డీఎల్పీఓ రమణయ్య మంగళవారం పొదలకూరులో వివాదాస్పద స్థలంపై విచారణ నిర్వహించేందుకు వచ్చి విమర్శలు ఎదుర్కొంటున్నారు. సీఎంఓ కార్యాలయానికి పొదలకూరుకు చెందిన ఓ వ్యక్తి స్థలం విషయమై వినతిపత్రం సమర్పించాడు. ఈ నేపథ్యంలో విచారణ నిర్వహించాల్సిందిగా అక్కడి నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇందుకు రమణయ్యను విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాల్సిందిగా ఉన్నతస్థాయి అధికారులు ఆదేశించారు. ఈ క్రమంలో ఆయన క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించేందుకు వచ్చారు. అయితే జెడ్పీ హైస్కూల్ స్థలం ఆక్రమణకు గురై ప్రైవేట్ వ్యక్తులు ఆ స్థలంలో నిర్మాణాలు చేపట్టటంపై గతంలో కలెక్టర్, జెడ్పీ సీఈఓ, జిల్లా, మండల సర్వేయర్లు, ఆర్డీఓ తదితరులంతా స్థలాన్ని సర్వే చేయించడంతోపాటు సమగ్ర విచారణ నిర్వహించారు. అంతేకాక స్థలం స్కూల్కు సంబంధించినదేనని నిర్ధారణ కూడా చేశారు. నాటి జెడ్పీ సీఈఓ ఈమేరకు హైస్కూల్ హెచ్ఎంకు వారి స్థలాన్ని కట్టుదిట్టం చేసుకోవాల్సిందిగా ఉత్తర్వులను కూడా అందజేశారు. అయితే అక్కడ నిర్మాణం పనులు చేపట్టిన వ్యక్తి తిరిగి సీఎంఓ కార్యాలయానికి వినతిపత్రం సమర్పించడంతో ఇది కొత్త అంశంగా విచారణ నిర్వహించాల్సిందిగా ఆదేశాలందాయి. ఈ నేపథ్యంలో డీఎల్పీఓ విచారణ నిర్వహించేందుకు హాజరై వెళ్తూ అర్జీదారుడితో కేఫ్లో మంతనాలు జరపడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరలైంది. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని స్థానికులు అంటున్నారు.


