
టీమిండియా దిగ్గజ క్రికెటర్ జహీర్ ఖాన్ తండ్రయ్యాడు. అతడి భార్య, బాలీవుడ్ నటి సాగరిక ఘట్కే పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని సాగరిక- జహీర్ దంపతులు బుధవారం సోషల్ మీడియా వెల్లడించారు.
చిన్నారి పేరేమిటంటే
ఈ మేరకు ‘‘ఆ దేవుడి దివ్యాశీసులతో.. మా వెలకట్టలేని సంతోషానికి, చిన్నారి కుమారుడికి స్వాగతం పలుకుతున్నాం’’ అని పేర్కొన్నారు. తమ కుమారుడికి ఫతేసిన్హ్ ఖాన్గా నామకరణం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కుమారుడిని చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్ చేయగా.. జహీర్- సాగరికలకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, కేఎల్ రాహుల్ భార్య, నటి అతియా శెట్టి, టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సతీమణి దేవిశా శెట్టి తదితరులు లవ్ సింబల్తో విషెస్ తెలియజేశారు.
పెళ్లైన ఎనిమిదేళ్లకు శుభవార్త
కాగా కొన్నాళ్లపాటు సాగరికతో ప్రేమలో మునిగితేలిన జహీర్ ఖాన్.. 2017లో ఇరు కుటుంబాల సమ్మతంతో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. తన గత ప్రేమ (ఈశా శర్వాణి) తాలుకు చేదు జ్ఞాపకాలను చెరిపి.. జీవితంలో నవ వసంతం తెచ్చిన సాగరికతో ఎనిమిదేళ్లుగా కలిసి అడుగులు వేస్తున్నాడు. ఇక ఇప్పుడు తమ ప్రేమకు గుర్తుగా కుమారుడి రాకతో ఈ జంట కుటుంబం పరిపూర్ణమైంది.
దిగ్గజ పేసర్గా నీరాజనాలు
మహారాష్ట్రకు చెందిన 46 ఏళ్ల జహీర్ ఖాన్.. లెఫ్టార్మ్ మీడియం పేసర్. 2000 సంవత్సరంలో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. పద్నాలుగేళ్ల కెరీర్లో 92 టెస్టులు, 200 వన్డేలు, 17 టీ20 మ్యాచ్లు ఆడాడు. టెస్టుల్లో 311, వన్డేల్లో 282, టీ20లలో 17 వికెట్లు కూల్చి.. దిగ్గజ పేసర్గా వెలుగొందాడు.
లక్నో మెంటార్గా
ఇక అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన అనంతరం ఐపీఎల్లో కొనసాగిన జహీర్ ఖాన్.. క్యాష్ రిచ్ లీగ్లో 100 మ్యాచ్లు ఆడి 102 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం.. ఐపీఎల్-2025లో లక్నో సూపర్ జెయింట్స్ మెంటార్గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడి మార్గదర్శనంలో లక్నో ఈ సీజన్లో ఇప్పటికి ఏడు మ్యాచ్లు పూర్తి చేసుకుని నాలుగు గెలిచింది.
చదవండి: KKR Vs PBKS: ’తప్పంతా నాదే.. అతడు కూడా నాతో అదే అన్నాడు.. ఓటమికి నేనే బాధ్యుడిని’
కెప్టెన్గా అది పంత్ నిర్ణయం.. నాకు బంతి ఇస్తాడేమోనని వెళ్లా.. కానీ..: బిష్ణోయి