
స్వదేశంలో (బార్బడోస్) ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న వేల ఓ విండీస్ క్రికెటర్పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. గయానీస్ వార్తా సంస్థ కైటూర్ న్యూస్ నివేదిక ప్రకారం.. గతేడాది ఆస్ట్రేలియాలో చారిత్రక విజయాన్నందించిన ఓ యువ ఆటగాడు అత్యాచారం, లైంగిక వేధింపులు సహా అనేక తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
ఓ టీనేజర్ సహా 11 మంది మహిళలు సదరు క్రికెటర్పై వేర్వేరుగా ఆరోపణలు చేశారు. తొలుత గయానాలోని బెర్బిస్కు చెందిన ఓ యువతి ఈ విషయాన్ని తెరపైకి తెచ్చింది. అప్పటి నుంచి వరుసగా 10 మంది మహిళలు సదరు క్రికెటర్పై ఆరోపణలు చేశారు. క్రికెటర్పై లైంగిక ఆరోపణల ఉదంతాన్ని కైటూర్ న్యూస్ 'మాన్స్టర్ ఇన్ మెరూన్' అనే శీర్షికతో ప్రచురించి వెలుగులోకి తెచ్చింది.
ఆతర్వాత గయానాలోకి స్పోర్ట్స్ మాక్స్ టీవీ ఈ అంశంపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. గయానా మీడియా ప్రకారం.. ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్న క్రికెటర్ను కొందరు విండీస్ క్రికెట్ బోర్డు పెద్దలు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. బాధిత మహిళలు కూడా ఈ విషయాన్ని నమ్ముతున్నారు.
క్రికెటర్ కెరీర్ను దృష్టిలో పెట్టుకొని విండీస్ క్రికెట్ బోర్డు పెద్దలు ఈ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా విస్మరిస్తున్నారని బాధితుల్లో ఒకరి తరఫు న్యాయవాది ఆరోపించారు. ఈ విషయంపై విండీస్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు డాక్టర్ కిషోర్ షాలోను సంప్రదించగా.. తనుకు కానీ, బోర్డుకు కానీ ఈ విషయం గురించి తెలీదని అన్నాడు. ఈ అంశంపై లోతుగా స్పందించేందుకు నిరాకరించాడు.
ఇదిలా ఉంటే, బార్బడోస్ వేదికగా వెస్టిండీస్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 180 పరుగులకే ఆలౌట్ కాగా.. వెస్టిండీస్ 190 పరుగులు చేసింది. 10 పరుగులు వెనుకపడి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆసీస్ 82 పరుగుల ఆధిక్యంలో ఉంది. ట్రవిస్ హెడ్ (13), వెబ్స్టర్ (19) క్రీజ్లో ఉన్నారు.