Kris Srikkanth Names Probable Contenders For ODI World Cup 2023 - Sakshi
Sakshi News home page

WC 2023: ఈసారి హోరాహోరీ తప్పదు.. ట్రోఫీ ఆ జట్టుదే: టీమిండియా మాజీ కెప్టెన్‌

Jun 28 2023 4:43 PM | Updated on Jun 28 2023 5:41 PM

WC 2023: Kris Srikkanth Names Probable Contenders To Win Cup - Sakshi

ICC ODI World Cup 2023 Winner Prediction: 2019 ప్రపంచకప్‌.. ఇంగ్లండ్‌- న్యూజిలాండ్‌ మధ్య నరాలు తెగే ఉత్కంఠ రేపిన ఫైనల్‌.. అనూహ్య రీతిలో టై అయిన మ్యాచ్‌.. అవును.. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో టై.. ఊపిరి బిగపట్టుకుని అభిమానులంతా జగజ్జేత ఎవరా? అని ఆసక్తికగా ఎదురుచూస్తున్న తరుణంలో సూపర్‌ ఓవర్‌ మరింత హీట్‌ పెంచింది.

బెన్‌ స్టోక్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌
చివరాఖరికి ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌నే విజయం వరించింది. ఫైనల్లో 84 పరుగులతో అజేయంగా నిలిచిన బెన్‌ స్టోక్స్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలవగా.. టోర్నీ ఆసాంతం అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న కేన్‌ విలియమ్సన్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డు దక్కింది.

లండన్‌లోని ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో జరిగిన ఈ థ్రిల్లింగ్‌ మ్యాచ్‌ తర్వాత భారత్‌ వేదికగా ఈసారి ప్రపంచకప్‌ జరుగనుంది. ఈ ఐసీసీ ఈవెంట్‌ అక్టోబరు 5న మొదలై నవంబరు 19న ముగియనుంది. ఈ నేపథ్యంలో క్రికెట్‌ వర్గాల్లో ఇప్పటి నుంచే హాట్‌ ఫేవరెట్లపై చర్చ మొదలైంది.

ఈసారి విజేత ఎవరంటే!
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ సారథి, 1983 ప్రపంచకప్‌ విజేత క్రిష్ణమాచారి శ్రీకాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈసారి ఫేవరెట్లలో టీమిండియా ముందుంది. అయితే, ఆస్ట్రేలియా జట్టును తక్కువగా అంచనా వేయలేం. వాళ్లు కూడా అద్భుతంగా ఆడుతున్నారు.

మరోవైపు.. ఇంగ్లండ్‌ కూడా పటిష్టంగా కనిపిస్తోంది. ఇక ఆస్ట్రేలియన్లకు ఇండియాలో కూడా బాగా ఆడగల సత్తా ఉంది. నా అభిప్రాయం ప్రకారం.. ఈసారి టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌.. ఈ మూడు జట్లలో ఒకటి కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుంది’’ అని శ్రీకాంత్‌ అంచనా వేశాడు. టీమిండియాకు సొంతగడ్డపై ఆడటం సానుకూలాంశమని.. ఇక ఇంగ్లండ్‌తో పోలిస్తే ఆసీస్‌కు భారత్‌లో టోర్నీ ఉండటం మేలు చేస్తుందని అభిప్రాయపడ్డాడు.

ఆసీస్‌ చరిత్ర ఘనం
కాగా ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఐదుసార్లు వన్డే వరల్డ్‌కప్‌ విజేతగా నిలవగా.. ఇంగ్లండ్‌ డిఫెండింగ్‌ చాంపియన్‌గా ఈసారి బరిలోకి దిగనుంది. ఇక 1983లో కపిల్‌ డెవిల్స్‌ భారత్‌కు తొట్టతొలి ప్రపంచకప్‌ అందించగా.. 2011లో మహేంద్ర సింగ్‌ ధోని రెండోసారి వన్డే వరల్డ్‌కప్‌ బహుమతిగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసారి రోహిత్‌ శర్మ సారథ్యంలోని జట్టు స్వదేశంలో ఏ మేరకు రాణిస్తుందో చూడాల్సి ఉంది!!

చదవండి: విండీస్‌కు చివరి చాన్స్‌; అసాధ్యమని తెలుసు.. అలా జరిగితే మాత్రం!
2011 టోర్నీ మొత్తం ధోని కిచిడీనే తిన్నాడు: సెహ్వాగ్‌.. రోహిత్‌ ఆ వడాపావ్‌ మానేసి..

Advertisement
 
Advertisement
Advertisement