WC 2022: ఆ ఇద్దరూ విఫలం.. వీళ్లపైనే భారం! అసలైన మ్యాచ్‌లో అంతా తలకిందులు! టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు

WC 2022 Ind Vs Eng: Reasons Behind Team India Failure In ICC Tourney - Sakshi

ICC Mens T20 World Cup 2022 - India vs England, 2nd Semi-Final: టీ20 ప్రపంచకప్‌-2022లో తమ ఆరంభ మ్యాచ్‌లో దాయాది పాకిస్తాన్‌ను ఓడించి విజయంతో టోర్నీ ప్రయాణాన్ని ఆరంభించింది టీమిండియా. ఆఖరి వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిపై 4 వికెట్ల తేడాతో గెలుపొంది అభిమానులకు మజాను అందించింది. తర్వాతి మ్యాచ్‌లో ‘పసికూన’ నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో 56 పరుగులతో జయభేరి మోగించింది.

ఇలా వరుస విజయాలతో జోరు మీదున్న రోహిత్‌ సేనకు సౌతాఫ్రికా చేతిలో మాత్రం భంగపాటు తప్పలేదు. పెర్త్‌ వేదికగా జరిగిన ఈ లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో ప్రొటిస్‌ జట్టు భారత్‌పై 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. తర్వాత బంగ్లాదేశ్‌తో హోరాహోరీ పోరు తప్పలేదు. వర్షం ఆటంకం కారణంగా డక్‌వర్త్‌ లూయీస్‌ ప్రకారం టీమిండియా 5 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక సూపర్‌-12లో ఆఖరిదైన జింబాబ్వేతో మ్యాచ్‌కు ముందే భారత జట్టుకు సెమీస్‌ బెర్తు ఖరారైన విషయం తెలిసిందే.

నెదర్లాండ్స్‌ సౌతాఫ్రికాను ఓడించడం సహా జింబాబ్వేపై 71 పరుగులతో గెలుపొందడంతో.. గ్రూప్‌-2 టాపర్‌గా సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన రోహిత్‌ సేన.. ఇంగ్లండ్‌తో అసలైన మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. బట్లర్‌ బృందాన్ని ఓడించి ఫైనల్‌ చేరి అక్కడ దాయాదిని ఓడించాలని కోరుకున్న ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది. ఏకంగా పది వికెట్ల తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరి టీమిండియా ఓటమికి ప్రధాన కారణాలు??!

ఓపెనర్ల వైఫల్యం.. 
టీ20 ప్రపంచకప్‌ ఎనిమిదో ఎడిషన్‌లో టీమిండియా ఓపెనింగ్‌ జోడీ కేఎల్‌ రాహుల్‌- రోహిత్‌ శర్మ ఆకట్టుకోలేకపోయారు. ఒకటీ రెండు మ్యాచ్‌లు మినహా పూర్తిగా నిరాశపరిచారు. ఏదో నియమం పెట్టుకున్నట్లుగా ఒక మ్యాచ్‌లో ఒకరు రాణిస్తే మరొకరు విఫలమయ్యారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ టోర్నీలో పాకిస్తాన్‌పై 4, నెదర్లాండ్స్‌పై 53, సౌతాఫ్రికాపై 5, బంగ్లాదేశ్‌పై 2, జింబాబ్వేపై 15 ఇంగ్లండ్‌పై 27 పరుగులు చేశాడు.

ఇక వైస్‌ కెప్టెన్‌ రాహుల్‌ ఇవే మ్యాచ్‌లలో వరుసగా 4,9,9,50, 51, 5 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్‌ అంటేనే దూకుడుగా ఆడాలి. పవర్‌ ప్లేలో వీలైనన్ని ఎక్కువ పరుగులు రాబట్టాలి. కానీ ఈ ఓపెనర్లు ఇద్దరూ విఫలం కావడంతో టీమిండియా పవర్‌ ప్లేలో పెద్దగా స్కోర్‌ చేయలేకపోయింది.

వాళ్లిద్దరిపైనే భారం
టీమిండియా ఓపెనర్లు విఫలమైన నేపథ్యంలో కీలక సమయాల్లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి, మిడిలార్డర్‌ బ్యాటర్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యతను తమ నెత్తిపై వేసుకున్నారు. వీరికి ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా కూడా తోడయ్యాడు. పాక్‌తో మ్యాచ్‌లో కోహ్లి 82 పరుగులతో అజేయంగా నిలిచాడు. పాండ్యా 40 పరుగులతో రాణించాడు. 

సౌతాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమి పాలైన సూర్యకుమార్‌ యాదవ్‌ 68 పరుగులతో రాణించి మరీ తక్కువ స్కోరుకే టీమిండియా పరిమితం కాకుండా పరువు దక్కించాడు. నెదర్లాండ్స్‌పై సూర్య 51, కోహ్లి 62 పరుగులతో అజేయంగా నిలిచారు.  బంగ్లాదేశ్తో మ్యాచ్‌లో కోహ్లి 64 పరుగులతో అజేయంగా నిలిస్తే.. సూర్య 16 బంతుల్లో 30 పరుగులు చేసి విలువైన ఇన్నింగ్స్‌ ఆడాడు.

సూర్య విఫలం కావడంతో
ఇక జింబాబ్వే మ్యాచ్‌లో సూర్య 61 పరుగులతో అజేయంగా నిలిచి భారీ విజయం నమోదు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. సూపర్‌-12 దశ ముగిసే సరికి కోహ్లి టాప్‌ స్కోరర్‌గా ఉండగా.. సూర్య మూడో స్థానంలో నిలిచాడు. 

అయితే ఇంగ్లండ్‌తో మ్యాచ్లో కోహ్లి అర్ధ శతకం బాదినా.. భారీ అంచనాల నడుమ బరిలోకి దిగిన సూర్య 14 పరుగులకే పెవిలియన్‌ చేరడం తీవ్ర ప్రభావం చూపింది. హార్దిక్‌ పాండ్యా 33 బంతుల్లో 63 పరుగులు చేశాడు కాబట్టి టీమిండియా 168 పరుగుల స్కోరు చేయగలిగింది.

కీలక సమయంలో నిరాశ పరిచిన బౌలర్లు
ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా లేకుండానే టీమిండియా ప్రపంచకప్‌ బరిలోకి దిగింది. గాయం కారణంగా అతడు దూరం కావడంతో సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమీ జట్టులోకి వచ్చాడు. మరో సీనియర్‌, డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు భువనేశ్వర్‌ కుమార్‌, యువ ఫాస్ట్‌బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, స్పిన్‌ ఆల్‌రౌండర్‌గా అక్షర్‌ పటేల్‌, పేస్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాలతో బలంగానే కనిపించింది భారత బౌలింగ్‌ విభాగం. భువీ, అర్ష్‌ కీలక సమయంలో రాణించినా.. అశూ, అక్షర్‌ ఆకట్టుకోలేకపోయారు. 

ముఖ్యంగా లెగ్‌ స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ను పూర్తిగా బెంచ్‌కే పరిమితం చేశారు. ఇక ఫైనల్‌ చేరాలంటే ఇంగ్లండ్‌తో గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బౌలర్ల ప్రదర్శన గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిది. టీమిండియా బ్యాటర్లను ఇంగ్లండ్‌ బౌలర్లు కట్టడి చేసిన అడిలైడ్‌ మైదానంలో ఒక్క భారత బౌలర్‌ కూడా ప్రభావం చూపలేకపోయాడు. ఓపెనర్లు బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌ యథేచ్ఛగా ఫోర్లు, సిక్స్‌లు బాది తమ జట్టును ఫైనల్‌కు చేర్చిన తీరు భారత బౌలర్ల వైఫల్యానికి అద్దం పట్టింది. 

ఆటలో ఏమాత్రం దూకుడు లేదు.. 
టోర్నీ ఆసాంతం పవర్‌ ప్లేలో దూకుడు చూపలేకపోయింది టీమిండియా. ఫీల్డింగ్ కూడా మరీ ఎంత గొప్పగా ఏమీలేదు. ఒకటీ రెండు మ్యాచ్‌లలో కొన్ని సూపర్‌ క్యాచ్‌లు మినహా అద్భుతాలేమీ జరుగలేదు. ముఖ్యంగా ఇంగ్లండ్‌తో సెమీస్‌లో ఆడుతుంది టీమిండియానా కాదా అన్న సందేహం తలెత్తేలా భారత జట్టు ఆట తీరు సాగింది. పవర్‌ ప్లేలో అయితే వికెట్‌ నష్టపోయి 38 పరుగులే చేయగలిగింది.

పాండ్యా మెరుపులు ఒక్కటే ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫ్యాన్స్‌కు కాస్త ఊరట. ఈ పరిణామాల నేపథ్యంలో ఓవైపు దాయాది పాక్‌ ఫైనల్‌కు చేరడం.. టీమిండియా సెమీస్‌లోనే ఇంటిబాట పట్టడంతో రోహిత్‌ శర్మ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా గతేడాది కోహ్లి సేన సెమీస్‌ చేరకుండానే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈసారైనా ట్రోఫీ సాధిస్తుందని ఫ్యాన్స్‌ భావిస్తే ఆశలు అడియాసలే అయ్యాయి.

చదవండి: Rohit Sharma On India Loss: తీవ్ర నిరాశకు లోనయ్యాం.. మా ఓటమికి ప్రధాన కారణం అదే.. క్రెడిట్‌ వాళ్లకే
ENG Vs IND: షమీపై కోపంతో ఊగిపోయిన రోహిత్‌ శర్మ.. గట్టిగా అరుస్తూ!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top