అరంగేట్రంపై హింట్‌ ఇచ్చిన వైభవ్‌ సూర్యవంశీ | Vaibhav Sooryavanshi Drops Cryptic Post Amid Intense India Debut Debate Ahead Of 2nd T20 Against England | Sakshi
Sakshi News home page

అరంగేట్రంపై హింట్‌ ఇచ్చిన వైభవ్‌ సూర్యవంశీ

Jul 4 2026 11:58 AM | Updated on Jul 4 2026 12:10 PM

Vaibhav Sooryavanshi Drops Cryptic Post Amid Intense India Debut Debate

భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రానికి ఎట్టకేలకు సమయం ఆసన్నమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో శనివారం (జులై 4) జరగనున్న రెండో టీ20లో వైభవ్‌కు తుది జట్టులో అవకాశం దక్కడం ఖాయంగా కనిపిస్తుంది.

వైభవ్‌ తన అంతర్జాతీయ అరంగేట్రం విషయాన్ని సోషల్‌మీడియా వేదికగా పరోక్షంగా వెల్లడించాడు. రెండో టీ20కి ముందు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో "New Chapter" అంటూ పోస్ట్ చేసి అరంగేట్రంపై పరోక్ష సంకేతాన్నిచ్చాడు. ఈ పోస్ట్‌ సోషల్‌మీడియాలో వైరలవుతోంది. 

వాస్తవానికి వైభవ్‌ టీమిండియా అరంగేట్రం కోసం అభిమానులు గత కొద్ది రోజులుగా వేచి చూస్తున్నారు. ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో వైభవ్‌ అరంగేట్రం ఖాయమని అంతా అనుకున్నారు. తీరా చూస్తే రెండో మ్యాచ్‌లోనూ అతడికి తుది జట్టులో అవకాశం దక్కలేదు. 

ఆతర్వాత ఇంగ్లండ్‌ సిరీస్‌ తొలి మ్యాచ్‌లోనూ వైభవ్‌ ఎంట్రీ కోసం భారత క్రికెట్‌ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూశారు. ఆ మ్యాచ్‌లోనూ అతడిని అవకాశం దక్కలేదు. తాజాగా వైభవ్‌ స్వయంగా తన అరంగేట్రంపై హింట్‌ ఇవ్వడంతో అభిమానులంతా ఈ రోజు మ్యాచ్‌లో అతడి మెరుపుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే, వైభవ్‌ అరంగేట్రంపై భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యువ ఆటగాడిని తొందరపడి జట్టులోకి తీసుకురావడంపై జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డాడు. 

ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌-2 బ్యాటర్‌గా ఉన్న అభిషేక్ శర్మ, టీ20 ప్రపంచకప్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్'గా నిలిచిన సంజూ శాంసన్ వంటి ఆటగాళ్లను పక్కనపెట్టి వైభవ్‌కు వెంటనే అవకాశం ఇవ్వడం సరైన నిర్ణయం కాదని పేర్కొన్నాడు.

వైభవ్‌పై కూడా ఎంతో నమ్మకం ఉందని.. అవకాశం వచ్చినప్పుడు అతడు తప్పకుండా సిద్ధంగా ఉంటాడని అన్నాడు.

మరోవైపు సంజూ శాంసన్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. యూకే పర్యటనలో అతని చివరి మూడు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 5, 0, 1 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండో టీ20లో సంజూకు విశ్రాంతి ఇచ్చి, వైభవ్ సూర్యవంశీకి తొలి అవకాశం ఇవ్వాలని చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement