
Sri Lanka Women vs India Women: ముక్కోణపు వన్డే సిరీస్లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత మహిళా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. శ్రీలంకతో ఆదివారం నాటి మ్యాచ్లో హర్మన్ప్రీత్ సేన మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా శ్రీలంక- భారత్- దక్షిణాఫ్రికా (Sri Lanka- India- South Africa) మధ్య లంక వేదికగా త్రైపాక్షిక సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా మూడు జట్ల మధ్య ఆరు మ్యాచ్ల తర్వాత ఫైనల్ జరుగుతుంది. ఈ క్రమంలో తొలి మ్యాచ్లో శ్రీలంకను తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసిన టీమిండియా.. రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై 15 పరుగుల తేడాతో గెలిచింది.
తాజాగా ఆదివారం శ్రీలంకతో మ్యాచ్లోనూ గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలని భావించింది. అయితే, అనూహ్య రీతిలో ఓటమిపాలైంది. కొలంబో వేదికగా టాస్ గెలిచిన ఆతిథ్య శ్రీలంక తొలుత బౌలింగ్ చేసింది.
స్మృతి మంధాన విఫలం
ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన భారత మహిళా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 275 పరుగులు చేసింది. ఓపెనర్లలో ప్రతికా రావల్ (35) ఫర్వాలేదనిపించగా.. స్మృతి మంధాన (18) మాత్రం విఫలమైంది.
మిగతా వాళ్లలో హర్లీన్ డియోల్ 29, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ 30, జెమీమా రోడ్రిగెస్ 37 పరుగులు చేయగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ అర్ధ శతకం (48 బంతుల్లో 58)తో రాణించింది. ఆల్రౌండర్లు దీప్తి శర్మ 24, కశ్వీ గౌతమ్ 17.. టెయిలెండర్లు స్నేహ్ రాణా 10, అరుంధతి రెడ్డి 9 (నాటౌట్) పరుగులు రాబట్టారు.
శ్రీలంక బౌలర్లలో సుగందిక కుమారి, కెప్టెన్ చమరి ఆటపట్టు మూడేసి వికెట్లతో చెలరేగగా.. డెమీ విహంగ, ఇనక రణవీర ఒక్కో వికెట్ దక్కించుకున్నారు.
హర్షిత, నీలాక్షి హాఫ్ సెంచరీలు
ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు ఓపెనర్లు హాసిని పెరీరా (22), విష్మి గుణరత్నె (33) శుభారంభం అందించగా.. వన్డౌన్ బ్యాటర్ హర్షిత సమరవిక్రమ హాఫ్ సెంచరీ (53)తో అదరగొట్టింది.
అయితే, కెప్టెన్ చమరి ఆటపట్టు మాత్రం స్థాయికి తగ్గట్లు ఆడలేక 23 పరుగులకే వెనుదిరగగా.. కవిష దిల్హారి (35)తో కలిసి నీలాక్షి డి సిల్వా (56) ఇన్నింగ్స్ చక్కదిద్దింది. వికెట్ కీపర్ బ్యాటర్ అనుష్క సంజీవని (23), సుగందిక కుమారి (19) కుమారి కలిసి అజేయంగా నిలిచి.. జట్టును విజయతీరాలకు చేర్చారు.
ఈ క్రమంలో మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఏడు వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసిన శ్రీలంక.. మూడు వికెట్ల తేడాతో హర్మన్ సేనను ఓడించింది. తదుపరి బుధవారం భారత జట్టు సౌతాఫ్రికాతో వన్డే ఆడనుంది.
భారత్ వర్సెస్ శ్రీలంక స్కోర్లు
👉భారత్ స్కోరు: 275/9 (50)
👉శ్రీలంక స్కోరు: 278/7 (49.1)
👉ఫలితం: మూడు వికెట్ల తేడాతో భారత జట్టుపై శ్రీలంక గెలుపు
👉ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: నీలాక్షి డి సిల్వ.
చదవండి: అక్కడ ఫీల్డర్ ఉండటం ఎప్పుడైనా చూశావా?: సహనం కోల్పోయిన ధోని