అక్కడ ఫీల్డర్‌ ఉండటం ఎప్పుడైనా చూశావా?: ధోని ఫైర్‌ | Aaj Tak Wahaan Fielder Dekha hai kabhi: Dhoni Calls out Teammate | Sakshi
Sakshi News home page

అక్కడ ఫీల్డర్‌ ఉండటం ఎప్పుడైనా చూశావా?: సహనం కోల్పోయిన ధోని

May 4 2025 5:09 PM | Updated on May 4 2025 5:38 PM

Aaj Tak Wahaan Fielder Dekha hai kabhi: Dhoni Calls out Teammate

Photo Courtesy: BCCI

ఐపీఎల్‌-2025 (IPL 2025)లో ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి నిష్క్రమించిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (CSK)కు శనివారం మరో చేదు అనుభవం ఎదురైంది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (RCB)తో మ్యాచ్‌లో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. కేవలం రెండు పరుగుల తేడాతో ధోని సేన పరాజయం పాలై.. సీజన్‌లో తొమ్మిదో ఓటమిని నమోదు చేసింది.

చెన్నై బౌలర్ల చెత్త ప్రదర్శన వల్ల బ్యాటర్ల మెరుపులు కూడా వృథా అయిపోయాయి. ముఖ్యంగా పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌ ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత చెత్త బౌలింగ్‌తో విమర్శల పాలయ్యాడు.

ఏకంగా 65 పరుగులు ఇచ్చి.. 
కేవలం మూడు ఓవర్ల బౌలింగ్‌లోనే ఏకంగా 65 పరుగులు ఇచ్చి.. ఐపీఎల్‌తో పాటు ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో ఓ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా ఖలీల్‌ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా మిస్టర్‌ కూల్‌గా పేరొందిన కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని కూడా సహనం కోల్పోయాడు.

ఓవైపు ఆర్సీబీ బ్యాటర్లు తమ బౌలింగ్‌ను చితక్కొడుతుంటే.. మరోవైపు ఖలీల్‌ ఏకాగ్రత లేకుండా ఫీల్డింగ్‌ చేయడం తలా కోపానికి కారణమైంది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో పదకొండో ఓవర్‌ను చెన్నై స్పిన్నర్‌ రవీంద్ర జడేజా వేయగా అప్పటికి విరాట్‌ కోహ్లి అర్ధ శతకానికి చేరువలో ఉన్నాడు.

అక్కడ ఫీల్డర్‌ ఉండటం ఎప్పుడైనా చూశావా?
అయితే, ఫీల్డ్‌ సెట్‌ చేస్తున్న వేళ ఖలీల్‌ మాత్రం శ్రద్ధ లేకుండా తన స్థానం నుంచి పక్కకు జరిగాడు. దీంతో సహనం కోల్పోయిన ధోని.. ‘‘ఖలీల్‌.. అక్కడ ఫీల్డర్‌ ఉండటం ఎప్పుడైనా చూశావా అసలు?’’ అంటూ వ్యంగ్యంగా చురకలు అంటించాడు. ఈ మాటలు స్టంప్‌ మైకులో రికార్డు అయ్యాయి.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే..   చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన పోరులో టాస్‌ గెలిచిన చెన్నై తొలుత బౌలింగ్‌ చేసింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది.

రొమారియో షెఫర్డ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌
ఓపెనర్లు జేకబ్‌ బెతెల్‌ (33 బంతుల్లో 55), విరాట్‌ కోహ్లి (33 బంతుల్లో 62) దంచికొట్టగా.. రొమారియో షెఫర్డ్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ (14 బంతుల్లో 53 నాటౌట్‌) ఆడాడు. చెన్నై బౌలర్లలో మతీశ పతిరణ మూడు వికెట్లు తీయగా.. నూర్‌ అహ్మద్‌, సామ్‌ కరన్‌ ఒక్కో వికెట్‌ దక్కించుకున్నారు.

లక్ష్య ఛేదనలో చెన్నై 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 211 పరుగుల వద్ద నిలిచిపోయింది. యువ ఓపెనర్‌ ఆయుశ్‌ మాత్రే (48 బంతుల్లో 94) శతకం చేజార్చుకోగా.. జడేజా మెరుపులు (45 బంతుల్లో 77 నాటౌట్‌) కూడా వృథాగా పోయాయి. ఈ విజయంతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్తానానికి దూసుకుపోగా.. చెన్నై ఆఖరిదైన పదో స్థానాన్ని మరోసారి అట్టిపెట్టుకుంది.

చదవండి: మాక్సీ స్థానంలో జట్టులోకి విధ్వంసకర వీరుడు.. ప్రకటించిన పంజాబ్‌ కింగ్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement