టీమిండియా యువ బ్యాటర్ తిలక్ వర్మ చిన్ననాటి స్నేహితుడు విక్రమ్ కాకడే మహారాష్ట్ర శాసన మండలి (ఎమ్మెల్సీ) సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ముంబైలోని విధాన్ భవన్లో ఇవాళ (జూన్ 23) జరిగిన కాకడే ప్రమాణస్వీకారానికి తిలక్ హాజరయ్యాడు. ఈ సందర్భంగా తిలక్ మాట్లాడుతూ.. నా స్నేహితుడి విజయాన్ని చూసి గర్వంగా ఉందని అన్నాడు.
"మేమిద్దరం చిన్నప్పటి నుంచి స్నేహితులం. ఆయన ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం చాలా ఆనందంగా ఉంది. అందుకే ప్రత్యేకంగా వచ్చి కలిశాను. ఆయన ఎప్పుడూ ప్రజలకు సహాయం చేస్తుంటారు. ఈ స్థాయికి చేరుకోవడం గర్వకారణం" అని తెలిపాడు.

ఇదే సందర్భంగా క్రికెట్ గురించి మాట్లాడుతూ.. ప్రపంచకప్ ఇంకా దూరంలోనే ఉందని, ప్రస్తుతం భారత జట్టు ఒక్కో సిరీస్పై దృష్టి పెడుతూ ముందుకు సాగుతోందని చెప్పాడు. ప్రతిరోజూ కష్టపడి మరింత మెరుగుపడటమే మా లక్ష్యం అని పేర్కొన్నాడు.
మహాయుతి జోరు
మహారాష్ట్ర శాసన మండలి ఎన్నికల్లో అధికార కూటమి మహాయుతి ఘన విజయం సాధించింది. 17 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 16 స్థానాలను కైవసం చేసుకుని ఆధిపత్యాన్ని చాటుకుంది. బీజేపీ 11, శివసేన 3, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 2 రెండు స్థానాలు గెలుచుకున్నాయి. పూణే నుంచి పోటీ చేసిన విక్రమ్ కాకడే (NCP) ఎలాంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం విశేషం.


